అత్తపై కత్తితో దాడి

అత్తపై కత్తితో దాడి

తాగుడుకు బానిసైన ఓ వ్యక్తి అత్తపై కత్తితో దాడి చేసి చెవి కోశాడు. అడ్డు వచ్చిన భార్యనూ గాయపర్చాడు. ఈ ఘటన మంగళవారం ఆదోనిలో చోటు చేసుకుంది. వన్‌ టౌన్‌ సీఐ చంద్రశేఖర్‌ వివరాల మేరకు.. పట్టణంలోని మరాఠగేరికి చెందిన మాధవి.. నిజాముద్దీన్‌ కాలనీకి చెందిన నరేష్‌ కుమార్‌ ఎనిమిది నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తర్వాత తాగుడుకు బానిస అయిన భర్త డబ్బు కోసం ఆమెను వేధించేవాడు.

భరించలేక ఇటీవలే మాధవి తన భర్తను వదిలి తల్లి సావిత్రమ్మ వద్దకు వెళ్లింది. భార్య పుట్టింటికి వెళ్లిపోవడాన్ని జీర్ణించుకోలేని నరేష్‌కుమార్‌ అత్త ఇంటికెళ్లి కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో సావిత్రమ్మ ఎడమ చెవి సగం తెగిపోయింది. అడ్డు వచ్చిన భార్యపై కూడా దాడికి పాల్పడ్డాడు. బాధితుల ఏడుపు విని ఇరుగుపొరుగు వారు రావడంతో నరేష్‌కుమార్‌ అక్కడి నుంచి పరారయ్యాడు.

జరిగిన ఘటనపై మాధవి ఫిర్యాదు మేరకు వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. తనను బ్లాక్‌ మెయిల్‌ చేసి పెళ్లి చేసుకోవడమే కాక వివాహ సమయంలో తీసుకెళ్లిన రూ.8 లక్షలు, 20 తులాల బంగారం తాగుడుకు ఖర్చు చేసి మళ్లీ ఇప్పుడు డబ్బు కోసం వేధిస్తున్నాడని మాధవి విలపించారు.