తోబుట్టువును హతమార్చిన సోదరుడు

తోబుట్టువును హతమార్చిన సోదరుడు

తోబుట్టువును సోదరుడే హతమార్చిన ఘటన నగరంలో ఆదివారం చోటుచేసుకుంది. పట్టాభిపురం ఎస్‌హెచ్‌ఓ రాజశేఖరరెడ్డి కథనం ప్రకారం మారుతీనగర్‌కు చెందిన కొవ్వూరి యేసు నగరంలో ఆటో నడుపుకుని జీవనం సాగిస్తాడు. 30 సంవత్సరాల క్రితం తన అక్క సీతామహాలక్ష్మి కుమార్తె దానమ్మను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇరువురు పిల్లలు. అయితే రెండు నెలల క్రితం యేసు ప్రమాదవశాత్తు గాయపడ్డాడు.

అనంతర కాలంలో భార్యతో తరచూ గొడవలు పడుతుండేవాడు. శనివారం భార్యాభర్తలు తారాస్థాయిలో గొడవపడడంతో సీతామహాలక్ష్మి ఇరువురికీ సర్దిచెప్పే ప్రయత్నం చేసి అక్కడే నిద్రకు ఉపక్రమించింది. దీంతో కోపం పెంచుకున్న యేసు తెల్లవారు జామున ముందు గదిలో నిద్రిస్తున్న అక్క సీతా మహాలక్ష్మమ్మను పలుగుతో మెడపై నొక్కి హత్యచేశాడు. అనంతరం మరోగదిలో నిద్రిస్తున్న భార్య దానమ్మను హతమార్చేందుకు యత్నించాడు.

దానమ్మ పెనుగులాడడంతో అలికిడికి పెద్ద కుమారుడు ఆదిసురేష్‌ నిద్రలేచి తండ్రిని అడ్డుకున్నాడు. తల్లీ, కుమారుడు ఇరువురు మరోగదిలోకి వెళ్లి తలుపులు వేసుకోని కేకలు వేయడంతో యేసు పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.