ఇల్లు లేదని యువకుడు ఆత్మహత్య

ఇల్లు లేదని యువకుడు ఆత్మహత్య

డబుల్‌బెడ్రూం ఇంటిని తనకు కేటాయించలేదని మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన చిలువేరి గౌతమ్‌(32) హైదరాబాద్‌లో ప్రైవేట్‌ కారుడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. స్థానికంగా నిర్మించిన డబుల్‌బెడ్రూం ఇంటి కోసం దరఖాస్తు చేసుకోగా అర్హుల జాబితాలో గౌతమ్‌ పేరు వచ్చింది. అయితే చివరి కేటాయింపు లిస్టులో తన పేరును అధికారులు తొలగించడంతో గౌతమ్‌ పదిరోజుల క్రితం ఇక్కడికి వచ్చి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరిగాడు.

తండ్రి పేరిట సొంతిల్లు ఉన్నందున డబుల్‌ బెడ్రూం ఇల్లు రాదని అధికారులు తేల్చి చెప్పడంతో గురువారం వేకువజామున భార్య, పిల్లలు నిద్రలో ఉండగా దూలానికి ఉరేసుకున్నాడు. అతడికి భార్య ప్రవళిక, కుమారుడు గణేశ్‌(4), కూతురు లాస్య(2) ఉన్నారు. కాగా, గౌతమ్‌ తండ్రి గంగప్రసాద్‌కు సొంతిల్లు, ఆ పక్కనే రెండు గుంటల ఖాళీస్థలం ఉండటంతో అతడి దరఖాస్తును తిరస్కరించినట్లు తహసీల్దార్‌ శ్రీకాంత్‌ తెలిపారు.