బావిలో శవమై తేలిన వ్యక్తి

బావిలో శవమై తేలిన వ్యక్తి

జళ్వార్ జిల్లా చాందానియాఖేది గ్రామానికి చెందిన సియారం మీనా దారుణ హత్యకు గురయ్యాడు. అనూహ్యంగా వ్యవసాయ బావిలో శవమై తేలాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహంపై గాయాలు చూసి అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడంతో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. సొంత తమ్ముడి భార్యే మరో ఇద్దరి సాయంతో అంతమొందించినట్లు తేలింది.

మానసికంగా స్థిరంగా ఉండని భర్తకి తరచూ ఏవేవో చెప్పి రెచ్చగొడుతున్నాడని.. తనను కొట్టేందుకు ప్రేరేపిస్తున్నాడని మీనాపై మరదలు గుడ్డి బాయ్ కోపం పెంచుకుంది. అతన్ని అంతమొందించాలని నిర్ణయించుకుని తన ప్రియుడు సోను మాలి, తన వద్ద పనిచేస్తున్న ఛత్తీస్‌గఢ్‌కి చెందిన శ్యామ్ భీల్‌తో కలిసి పథకం రచించింది. రాత్రి వేళ లైట్ ఇస్తానని చెప్పి బొరెఖేది సమీపంలోని పొలంలోకి మీనాని రప్పించింది.

అక్కడికి వచ్చిన మీనాపై సోను, శ్యామ్ దాడి చేసి చంపేశారు. అనంతరం అతని శవాన్ని అక్కడే బావిలో పడేసి వెళ్లిపోయారు. నిందితులు గుడ్డిబాయ్, శ్యామ్‌ని అదుపులోకి తీసుకుని పోలీసులు తమ స్టైల్లో విచారించడంతో అసలు నిజాలు కక్కేశారు. ఆమె ప్రియుడు సోను ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతన్ని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.