గుడిగోపురం పైనుంచి… హైటెన్షన్ తీగలపై పడి.. అక్కడికక్కడే..

తమిళనాడులో ఘోరం జరిగింది. తిరువారూర్ త్యాగరాజస్వామి ఆలయ గోపురంపై నుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యకు ఒడిగట్టాడు. అప్పుల బాధతోనే సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. గుడి గోపురమెక్కి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించిన వ్యక్తి.. అనూహ్యంగా కరెంట్ షాక్‌తో మృత్యువాత పడ్డాడు. అయితే తిరువారూర్‌లోని ముదలియార్ వీధికి చెందిన జయాబల్ అనే వ్యక్తి మిడిల్ ఈస్ట్‌ దేశానికి చెందిన ఓ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. ఆరు నెలల కిందట సొంతూరికి తిరిగి వచ్చేసి తల్లి, తమ్ముడితో కలసి తిరువారూర్‌లోనే నివాసం ఉంటున్నాడు.

అయితే గతంలో చేసిన అప్పులు విపరీతంగా పెరిగిపోవడంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు జయాబల్. తిరువారూర్‌లోని త్యాగరాజస్వామి ఆలయ ఉత్తర గోపురంపై నుంచి అమాంతం దూకేశాడు. అయితే మధ్యలో హైటెన్షన్ కరెంట్ వైర్లపై పడడంతో షాక్‌కి గురయ్యాడు. కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు.

కాగా సమాచారం తెలుసుకొన్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. గోపురంపై నుంచి పడుతూ విద్యుత్ వైర్లపై పడడంతో విద్యుత్ షాక్‌ కు గురై అక్కడికక్కడే మరణించినట్లు వెల్లడించారు.