వడ్డీ కట్టలేదని భార్యను ఎత్తుకెళ్లిన వ్యాపారి

తెలంగాణలోని భద్రాద్రి జిల్లాలో తీవ్రమైన ఘోరం జరిగింది. అప్పు తగిన సమయానికి చెల్లించలేదని.. ఆక్రోశంతో ఊగిపోయిన ఓ వడ్డీ వ్యాపారి నీచానికి దిగజారాడు. రుణం తీసుకున్న వ్యక్తి భార్యను తన ఇంటికి లాక్కెళ్లి అక్కడ కట్టేశాడు.

అయితే వడ్డీ డబ్బులు చెల్లించలేదన్న కోపంతో ఓ వడ్డీ వ్యాపారి దారుణానికి దిగాడు. రుణగ్రహీత, అతడి భార్యను ఇంట్లో నుంచి బయటకు లాక్కొచ్చి విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం సులానగర్‌లో తాజాగా చోటుచేసుకుంది. సులానగర్‌కు చెందిన అజ్మీరా హట్యా అదే గ్రామానికి చెందిన బానోత్‌ హన్మా అనే వడ్డీ వ్యాపారి వద్ద గతంలో రూ.2లక్షల అప్పు తీసుకున్నాడు. వీటిలో రూ.1.50 లక్షలు ఈ మధ్యనే తిరిగి ఇచ్చేశాడు కూడా.

అలాగే.. ఈ లాక్‌డౌన్‌ కారణంగా మిగిలిన అసలు, వడ్డీ చెల్లించేందుకు వడ్డీ వ్యాపారిని అజ్మీరా గడువు కోరాడు. అందుకు ఒప్పుకోని వ్యాపారి తన అప్పు మొత్తం తీర్చేయాలంటూ అతడిపై ఒత్తిడి తెచ్చాడు. దీంతో రెట్టింపైన కోపంతో హట్యా ఇంటికి వెళ్లి అతనిపై దాడి చేశాడు. అడ్డుపడిన హట్యా భార్యను తన ఇంటికి లాక్కెళ్లి బంధించేశాడు. కాగా బాధితుడి ఫిర్యాదుతో టేకులపల్లి పోలీసులు హన్మాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.