లోన్‌ ఇస్తామని మోసం చేసారు

లోన్‌ ఇస్తామని మోసం చేసారు

‘హలో సార్, మేము ముద్ర కంపెనీ నుంచి మాట్లాడుతున్నాం. మీ బ్యాంకు లావాదేవీలు చక్కగా ఉండటం వల్ల మీకు మా కంపెనీ నుంచి రూ.10లక్షల లోను మంజూరైయ్యాందంటూ లాలగూడ వాసి కిరణ్‌కుమార్‌కు ఇటీవల ఓ వ్యక్తి కాల్‌ చేశాడు. మీ బ్యాంకు డాక్యుమెంట్స్‌తో పాటు లోన్‌ చార్జీలకు గాను రూ.3లక్షలు చెల్లించాలన్నారు.

మొదట్లో అనుమానం వచ్చినా లోన్‌కు ప్రయత్నించకుండానే రూ.10 లక్షలు వస్తున్నప్పుడు రూ.3 లక్షలు ఇస్తే ఏమౌతుందిలే అని అనుకున్నాడు కిరణ్‌కుమార్‌. వారడిగిన విధంగా డాక్యుమెంట్స్‌ను మెయిల్‌ చేసి వారు చెప్పిన అకౌంట్‌ నంబర్‌లకు రూ.3 లక్షలు ట్రాన్స్‌ఫర్‌ చేశాడు. డబ్బులు ఇచ్చిన 48 గంటల్లో రూ.10 లక్షలు అకౌంట్‌లో జమ అవుతాయని నమ్మించారు. రోజులు గడిచినా రూ.10 లక్షలు రాకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు గురువారం సిటీ సైబర్‌ క్రైం ఏసీపీ కేవీఎన్‌ ప్రసాద్‌కు ఫిర్యాదు చేశాడు.