అత్తింటి వేదింపులకి బలైన నవ వధువు

అత్తింటి వేదింపులకి బలైన నవ వధువు

పెళ్లయిన రెండు నెలలకే నవ వధువు అత్తింటి ఆరళ్లకు బలైన ఘటన సిద్ధిపేట జిల్లా దుబ్బాకలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుబ్బాక మున్సిపాల్టీ పరిధిలోని చెల్లాపూర్‌ రెండో వార్డుకు చెందిన అక్కల రాధా కిషన్‌ గౌడ్‌, లక్ష్మిల పెద్ద కుమార్తె పవిత్ర అలియాస్‌ తేజస్వి (22)కి మే 28న వివాహం జరిగింది. దుబ్బాక మండలంలోని గంభీర్‌పూర్‌ గ్రామానికి చెందిన చేపూరి యాదయ్య, బాల లక్ష్మిల ఏకైక కుమారుడు శ్రీకాంత్‌‌కు ఇచ్చి పెళ్లి చేశారు. అత్తింటిలో అడుగుపెట్టి రోజు నుంచే పవిత్రకు వేధింపులు మొదలయ్యాయి.

భర్త, అత్త తీవ్రంగా వేధించడంతో మానసికంగా కలత చెందిన పవిత్ర ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. బుధవారం బీఎడ్‌ సెమిస్టర్‌ పరీక్షకు హాజరైన పవిత్రను.. భర్త శ్రీకాంత్‌ గౌడ్‌ కాలేజీ వద్ద వదిలి వెళ్లాడు. పరీక్ష రాసిన తర్వాత తన అన్న స్నేహితుడు మొబైల్‌ ఫోన్‌కు తనకు జీవితంపై విరక్తి కలిగిందంటూ పవిత్ర మెసేజ్ పంపింది. అనంతరం ఫోన్‌ స్విచ్చాఫ్ చేసి.. కాలేజీ నుంచి నేరుగా దుబ్బాక పట్టణ సమీపంలోని పెద్దచెరువు వద్దకు వెళ్లి దూకింది.

పవిత్ర అన్న స్నేహితుడు ఇచ్చిన సమాచారంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందారు.కుటుంబసభ్యులు, బంధువులు దుబ్బాక పట్టణమంతా గాలించారు. ఆమె ఆచూకీ లభించకపోవడంతో బుధవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం పవిత్ర మృతదేహం చెరువులో తేలడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే వారు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని చెరువులో నుంచి బయటకు తీశారు.

పోస్ట్‌మార్టం కోసం సిద్దిపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేప్టటారు.అత్తింటి వేధింపులకు భరించలేక తన కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని పవిత్ర తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు ఆమె భర్త, అత్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. గృహహింస, వరకట్న వేధింపులు తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.