డబ్బు కోసం దారుణ హత్య

డబ్బు కోసం దారుణ హత్య

డబ్బు అడిగినందుకు మహిళను దారుణంగా హత్య చేసి సెప్టిక్‌ ట్యాంక్‌లో పడవేసిన నిందితులను అరెస్టు పర్వతగిరి పోలీసులు అరెస్టు చేసినట్లు ఈస్ట్‌జోన్‌ డీసీపీ వెంకటలక్ష్మి తెలిపారు. హన్మకొండలోని కమిషనరేట్‌లో బుధవారం నిర్వహించిన సమావేశంలో డీసీపీ నిందితుల వివరాలను వెల్లడించారు. పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్‌కు చెందిన ఒగ్గు కొంరయ్య తన భార్య కొంరమ్మ(50) ఈనెల 4 సాయంత్రం నుంచి కనిపించడం లేదని పర్వతగిరి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

దీంతో పోలీసులు మిస్సింగ్‌ కింద కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు. ఇంతలోనే ఈనెల 8న పోడేటి కృష్ణ పర్వతగిరి పోలీసుల ఎదుట లొంగిపోయి కొంరమ్మను తన స్నేహితుడు మేకల రాజు తో కలిసి హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. ఈ సందర్భంగా విచారణ చేపట్టగా వివరాలు వెల్లడించారు. ఇద్దరు నిందితులు మంచి స్నేహితులని, నిందితుడు కృష్ణ ఇంటి వద్ద తరుచూ దావత్‌ చేసుకుంటారని డీసీపీ తెలిపారు. ఈనెల 4న వీరితో పాటు పంథినికి చెందిన మని, కుమార్‌ కృష్ణ ఇంటి దగ్గర దావత్‌ చేసుకున్నారు.

మృతురాలు ఒగ్గు కొంరమ్మ సాయంత్రం 4 గంటల సమయంలో కృష్ణ ఇంటికి వచ్చి డబ్బు ఇవ్వాలని ఆడగగా పంపించివేశారు. మృతురాలు మరోసారి డబ్బు కోసం ఇంటికి రాగా నిందితులు కృష్ణ, రాజు ఆమెను బలవంతం చేయబోగ తిరస్కరించి, విషయాన్ని పెద్దలకు చెబుతానని బెదిరించింది. దీంతో కృష్ణ ఇటుకతో, రాజు కర్రతో కొట్టి ఆమెను హత్య చేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని సెప్టిక్‌ ట్యాంక్‌లో పడేసి మూసివేసినట్లు డీసీపీ పేర్కొన్నారు.

అయితే, కొమురమ్మ ఆచూకీ కోసం ఆరా తీసే క్రమంలో కృష్ణపై అనుమానం రాగా, ఎలాగైన దొరికిపోతాననే భయంతో పోలీసుల ఎదుట లొంగిపోయాడని తెలిపారు. కాగా, నిందితులను గుర్తించడంలో ప్రతిభ కనపరిచిన మామునూర్‌ ఏసీపీ నరేష్‌ కుమార్, పర్వతగిరి ఇన్‌స్పెక్టర్‌ కిషన్, ఎస్సైలు నరేష్, మహేందర్‌ డీసీపీ అభినందించారు.