సెల్‌ఫోన్‌ కోసం ప్రాణం కోల్పోయిన వ్యక్తి

సెల్‌ఫోన్‌ కోసం ప్రాణం కోల్పోయిన వ్యక్తి

సెల్‌ఫోన్‌ కోసం జరిగిన వివాదంలో ఒకరు ప్రాణం కోల్పోయిన ఘటన జగద్గిరిగుట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగద్గిరిగుట్ట ప్రాంతంలో ఉన్న శశి వైన్స్‌ వద్ద సోమవారం భూక్య భీమా, తన స్నేహితుడు ఫుల్‌గా మద్యం సేవించారు. తాగిన మత్తులో వారిద్దరి మధ్య సెల్‌ఫోన్‌ కోసం గొడవ జరిగినట్లు ప్రత్యక్ష వైన్స్‌ షాపు సెక్యూరిటీ గార్డ్‌ తెలిపాడు.

వైన్స్‌ మూసేసిన తర్వాత సెక్యూరిటీ గార్డ్‌ భోజనం చేయడానికి పక్కకు వెళ్లగా ఒక పెద్ద బండరాయి శబ్ధం రావడంతో తిరిగి వైన్స్‌ వద్దకు చేరుకొని చూడగా ఓ వ్యక్తి తలపై బండరాయితో మోది హత్య చేయబడ్డాడని గమనించి వెంటనే జగద్గిరిగుట్ట పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని హత్య కాబడ్డ వ్యక్తి జేబులో ఉన్న బుక్‌ను చెక్‌ చేయగా అతడి పేరు భూక్య భీమాగా గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. హత్య చేసిన వ్యక్తి కోసం గాలిస్తున్నామని సీఐ సైదులు తెలిపారు.