క్రికెటర్ కావాలని పిచ్చి…సొంతింటికే కన్నం వేసి దొరికిన ఘనుడు !

man stolen in his own house

క్రికెటర్ కావాలని కలలుగన్న ఓ యువకుడు సొంతిట్లోనే చోరీకి పాల్పడి దొరికిపొయిన ఘటన కృష్ణా జిల్లా కంచికచర్లలో చోటుచేసుకుంది. తాత బ్యాంకులో నుంచి తెచ్చి బీరువాలో పెట్టిన రూ.10లక్షల నగదును కొట్టేసి క్రికెట్ కోచింగ్ కోసం విశాఖ వెళ్ళిపోయాడు. అయితే చోరీ జరిగినప్పటి నుంచి మనవడు పత్తా లేకపోవడంతో మనవడిపైనే తాత అనుమానం వ్యక్తం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. కంచికచర్ల వసంత కాలనీలో షేక్‌ జానీ బాషా అనే వ్యక్తి భార్య, కుమార్తె, మనవడు మహబూబ్‌ సుభానితో కలిసి సొంతింట్లో నివసిస్తున్నాడు. పొలం కొనుగోలు చేసేందుకు ఈ నెల 9వ తేదీన బ్యాంకు నుంచి రూ.10లక్షలు విత్‌డ్రా చేసిన బాషా ఆ సొమ్మును ఇంట్లోని బీరువాలో దాచాడు. అదేరోజు రాత్రి కుటుంబసభ్యులంగా డాబా పైని నిద్రించారు. మహబూబ్‌ సుభానికి గొప్ప క్రికెటర్ కావాలన్న కల కోసం కోచింగ్ అకాడమీలో చేరాలని అనుకునేవాడు. దీంతో రూ.10 లక్షల మీద కుర్రాడి కన్నుపడింది. అర్ధరాత్రి అమ్మమ్మ దగ్గరున్న ఇంటి తాళాలు తీసుకుని తలుపులు తెరిచాడు. బెడ్‌రూమ్‌లో బీరుతా తాళాలు కనిపించకపోవడంతో స్క్రూడ్రైవర్‌తో బీరువా తెరిచి మొత్తం సొమ్ముతో ఉడాయించాడు. విజయవాడ చేరుకున్న సుభాని రూ.1.35లక్షలతో ఐఫోన్, రూ.19వేలతో క్రికెట్ కిట్ కొన్నాడు. అక్కడి నుంచి వైజాగ్ చేరుకుని లాడ్జిలో రూమ్ తీసుకున్నాడు. క్రికెట్ కోచింగ్ కోసం పలువురిని సంప్రదించారు. మరోవైపు ఇంట్లో రూ.10లక్షలు చోరీకి గురవడంతో బాషా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటన జరిగిన రోజు నుంచి ఆయన మనవడు కనిపించకుండా పోవడంతో ఆ కోణంలో దర్యాప్తు చేపట్టారు. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా సుభానీని అదుపులోకి తీసుకుని రూ.8లక్షల నగదు, ఐఫోన్, క్రికెట్ స్వాధీనం చేసుకున్నారు. మనవడే సొమ్ము చోరీ చేశాడని తెలిసి భాషా షాకయ్యాడు.