Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
విభజన హామీల అమలు విషయంలో కేంద్రప్రభుత్వ వైఖరికి నిరసనగా బీజేపీతో పొత్తును తెగతెంపులు చేసుకునేదిశగా టీడీపీ అడుగులు పడుతున్న నేపథ్యంలో ఏపీ మంత్రి, బీజేపీ రాష్ట్ర నేత మాణిక్యాలరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీపై కేంద్రం చూపిస్తున్న వివక్షకు వ్యతిరేకంగా టీడీపీ కేంద్రం నుంచి వైదొలిగితే… బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు వైసీపీ సిద్ధంగా ఉందన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న ప్రధాన ఆరోపణ. కేసుల నుంచి బయటపడేందుకు జగన్ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి మరీ కేంద్రానికి దగ్గరవుతున్నారని ముఖ్యమంత్రితో పాటు టీడీపీ నేతలంతా ఆరోపిస్తున్నారు. తాజాగా టీడీపీ బీజేపీ పొత్తుపై మంత్రి మాణిక్యాలరావు చేసిన వ్యాఖ్యలు గమనిస్తే… ముఖ్యమంత్రి ఆరోపణ నిజమేననిపిస్తుంది. ఒకరు తమతో పొత్తు వద్దనుకుంటే మరొకరు కలవడానికి సిద్ధంగా ఉన్నారని మాణిక్యాల రావు వ్యాఖ్యానించారు. అమరావతిలో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన మాణిక్యాలరావు పొత్తుపై బీజేపీ వైఖరి వెల్లడించారు.
తమ అధిష్టానానికి రెండు ప్రత్యామ్నాయాలు ఇచ్చామని తెలిపారు. టీడీపీ తెగదెంపులు చేసుకోకముందే తామే రాష్ట్ర ప్రభుత్వం నుంచి బయటకురావడం, ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ రాష్ట్రానికి ఏం చేశామో ప్రజలకు చెప్పడం ఒకటి కాగా… ఒకవేళ పొత్తు కొనసాగే పక్షంలో బహిరంగ సభ ఏర్పాటుచేసి… ఆ సభకు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీని ఆహ్వానించి… ఆయనచేతే… రాష్ట్రానికి కేటాయించిన నిధుల గురించి ప్రజలకు వివరింపచేయడం రెండో ప్రత్యామ్నాయమని తెలిపారు. కేంద్ర బడ్జెట్ మలివిడత సమావేశాల్లోపే జైట్లీని రాష్ట్రానికి తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని మాణిక్యాలరావు చెప్పారు. తమ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే నిమిషంలో మంత్రి పదవులకు రాజీనామా చేస్తామన్నారు. టీడీపీతో పొత్తు విడిపోతే బీజేపీకి పెద్దగా నష్టం ఉండదని, ఒకరు తమతో పొత్తు వదులుకుంటే ఇంకొకరు కలవడానికి సిద్ధంగా ఉన్నారని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.