ప్రాణం తీసిన సహజీవనం

ప్రాణం తీసిన సహజీవనం

వివాహేతర సంబంధం మోజులో కట్టుకున్న భార్యను వదిలేశాడు. భార్యాబిడ్డలను వదిలి ప్రియురాలితో సహజీవనం చేశాడు. ఆమె మరొకరితో కూడా సన్నిహితంగా ఉంటోందని తెలిసి తిరిగి ఇంటికి చేరాడు. అప్పటిదాకా కలసి ఉన్న ప్రియుడు భార్య దగ్గరికెళ్లిపోవడంతో ప్రియురాలు వేధించడం మొదలుపెట్టింది. తనకు డబ్బులు చెల్లించాలంటూ ఒత్తిడి చేయడంతో భరించలేక యువకుడు ఉరేసుకుని చనిపోయాడు. ఈ విషాద ఘటన గుంటూరు జిల్లాలో వెలుగుచూసింది.

చిలకలూరిపేట మండలం మద్దిరాలకు చెందిన నాంపల్లి మస్తానయ్య(38) టైలర్‌గా పనిచేస్తుంటాడు. ఆయనకి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గతంలో పిడుగురాళ్ల సమీపంలోని కొండమోడులో నివాసమున్న సమయంలో మరో మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. భార్యబిడ్డలను పట్టించుకోకుండా కొద్దికాలం ఆమెతో సహజీవనం చేశాడు. అయితే ఆమెకు మరొకరితో కూడా సంబంధం ఉందని తెలియడంతో తిరిగి భార్యాబిడ్డల దగ్గరికి వచ్చేశాడు.

స్వగ్రామం మద్దిరాలలో ఉంటూ చిలకలూరిపేట పట్టణంలోని గాంధీపేటలో దుకాణం ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. ప్రియుడు తనను విడిచి వెళ్లిపోవడంతో కక్ష గట్టిన ప్రియురాలు వేధించడం మొదలుపెట్టింది. తనకు డబ్బులు ఇవ్వాలంటూ పెద్దమనుషులతో పంచాయితీ పెట్టింది. ఐదు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. అంత ఇచ్చుకోలేనని.. రూ.50 వేలు చెల్లిస్తానని ఒప్పందం చేసుకున్నాడు.

అయితే డబ్బుల కోసం ప్రియురాలు, ఆమె కుటుంబ సభ్యులు వేధింపులకు గురిచేయడంతో తీవ్రమనస్థాపానికి గురైన మస్తానయ్య ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. చనిపోయే ముందు తన మరణానికి ప్రియురాలు, ఆమె బంధువులే కారణమని చెప్పి సెల్ఫీ వీడియో తీసి కుటుంబ సభ్యలకు పంపాడు. అది చూసిన కుటుంబ సభ్యులు వెంటనే గాంధీనగర్‌లోని దుకాణానికి వచ్చేసరికి ఉరేసుకుని చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.