కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య

కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య

‘మీకు పెద్దపులిని చూపిస్త.. నాతో రండి’అని ఓ తల్లి తన ఇద్దరు కుమారులను గ్రామ శివారులోని వ్యవసాయ బావి వద్దకు తీసుకెళ్లింది. అనంతరం అక్కడ పిల్లలతో కలసి బావిలో దూకింది. ఈ ఘటనలో తల్లి, పెద్దకుమారుడు మృతిచెందగా, చిన్నకుమారుడు ప్రాణాలతో బయటపడ్డాడు. జగిత్యాల జిల్లా రాయికల్‌ మండలం కిష్టంపేటలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కిష్టంపేటకు చెందిన కస్తూరి సంపత్, లావణ్య భార్యాభర్తలు. వీరికి గణేశ్‌, హర్షవర్ధన్‌ అనే కుమారులు ఉన్నారు.

పదేళ్ల క్రితం స్టేషన్‌ఘన్‌పూర్‌ నుంచి ఉపాధి కోసం కిష్టంపేట గ్రామానికి వచ్చారు. ఇక్కడే కూలీ పనిచేసుకుంటూ బతుకుతున్నారు.శుక్రవారం భార్యాభర్తలు అల్లీపూర్‌ గ్రామంలోని ఓ మేస్త్రీ వద్ద కూలీ పనిచేసి ఇంటికి తిరిగి వచ్చారు. కొద్దిసేపటి తర్వాత లావణ్య.. పెద్దపులిని చూపిస్తానంటూ తన ఇద్దరు కుమారులతో కలసి గ్రామ శివారులోని ఓ వ్యవసాయ బావివద్దకు వెళ్లింది. తర్వాత ఇద్దరు కుమారులను పట్టుకుని బావిలో దూకింది.

అయితే, ఈ ప్రయత్నంలో తల్లి, పెద్దకుమారుడు బావిలో పడిపోగా హర్షవర్ధన్‌ బావిగట్టువద్దే ఉండిపోయాడు. వెంటనే బాలుడు అక్కడ ఉన్నవారికి ఈ విషయం చెప్పగా, వారు బావి వద్దకు చేరుకుని లావణ్య, గణేశ్‌ను కాపాడేందుకు ప్రయత్నించారు. కానీ అప్పటికే వారు నీటిలో మునిగి చనిపోయారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ కలహాలతోనే లావణ్య ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది.