పరుగుల మోత మోగిస్తున్న పంజాబ్‌ ఆటగాడు

పరుగుల మోత మోగిస్తున్న పంజాబ్‌ ఆటగాడు

ఈ ఐపీఎల్‌లో కింగ్స్‌ పంజాబ్‌ ఆటగాడు మయాంక్‌ అగర్వాల్‌ పరుగుల మోత మోగిస్తున్నాడు. రాజస్తాన్‌ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 26 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ సాధించి బ్యాటింగ్‌ పవర్‌ మరోసారి చూపెట్టాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌ జరిగిన గత మ్యాచ్‌లో 89 పరుగులు సాధించిన మయాంక్‌.. మళ్లీ విరుచుకుపడ్డాడు. మయాంక్‌ బ్యాటింగ్‌తో కింగ్స్‌ పంజాబ్‌ 10 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 110 పరుగులు చేసింది. ఇందులో మయాంక్‌వి 69 పరుగులు ఉన్నాయి. ఈ పరుగుల్లో 6 సిక్స్‌లు, 5 ఫోర్లు ఉండటం విశేషం.

మరొకవైపు కింగ్స్‌ పంజాబ్‌ పవర్‌ప్లేలో రికార్డు నమోదు చేసింది. ఈ ఐపీఎల్‌లో అత్యధిక పవర్‌ప్లే పరుగులు చేసిన జట్టుగా నిలిచింది. పవర్‌ప్లేలో కింగ్స్‌ పంజాబ్‌ 60 పరుగులు చేసింది. దాంతో ముంబై ఇండియన్స్‌ నమోదు చేసిన 59 పరుగుల పవర్‌ ప్లే రికార్డును కింగ్స్‌ పంజాబ్‌ అధిగమించింది. రాజస్తాన్‌ రాయల్స్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌.. ముందుగా కింగ్స్‌ పంజాబ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.

దాంతో కింగ్స్‌ పంజాబ్‌ ఇన్నింగ్స్‌ను రాహుల్‌, మయాంక్‌లు ఆరంభించారు. వీరిద్దరూ వచ్చీ రావడంతోనే రాజస్తాన్‌ రాయల్స్‌కు చుక్కలు చూపించారు. ఏ బౌలర్‌ను విడిచిపెట్టకుండా మెరుపులు మెరిపించారు. ఇక రాహుల్‌ 35 బంతుల్లో 5ఫోర్లు, 1 సిక్స్‌తో హాఫ్‌ సెంచరీ సాధించాడు. దాంతో 13 ఓవర్లలో కింగ్స్‌ పంజాబ్‌ 148 పరుగులు చేసింది.