తల్లి మందలించిందని పారిపోయిన యువతి

తల్లి మందలించిందని పారిపోయిన యువతి

తల్లి మందలించడంతో అలిగి వచ్చిన యువతిని తిరుపతి బస్టాండ్‌ భద్రతా సిబ్బంది కుటుంబ సభ్యుల వద్దకు చేర్చారు. వివరాల్లోకి వెళితే తమిళనాడులోని సేలంకు చెందిన సుందర పాండ్యన్‌ కుమార్తె హాసిని బెంగళూరులో చదువుకుంటోంది. సెలవుల నేపథ్యంలో ఇటీవల ఇంటికి వెళ్లింది. ఇంటి వద్ద చిన్నపాటి పనులు కూడా చేయకుండా సోమరిగా ఉండడంతో, ఆదివారం ఉదయం ఆమె తల్లి కల్యార్‌సీ మందలించింది. దీంతో అలిగిన హాసిని ఇంటి నుంచి బయల్దేరి వచ్చేసింది. హాసిని తల్లిదండ్రులు సేలం పోలీస్‌స్టేషన్‌లో కుమార్తె అదృశ్యంపై ఫిర్యాదు చేశారు.

సోమవారం ఉదయం 8గంటలకు హాసిని తిరుపతికి చేరుకుంది. తిరుపతి బస్టాండ్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్న యువతిని భద్రతా సిబ్బంది షేకా ఖాజా రహంతుల్లా గుర్తించారు. వెంటనే దిశ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారి సాయంతో ఆ యువతి వివరాలను తెలుసుకుని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. తల్లిదండ్రులు మధ్యాహ్నం 1.30గంటల సమయంలో తిరుపతి బస్టాండ్‌కు చేరుకుని వారి కుమార్తెను కలుసుకున్నారు. అనంతరం ఆర్టీసీ భద్రతా సిబ్బందికి, దిశ పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేశారు.