ప్రధాని నరేంద్ర మోదీ పాటల రచయితగా మారారు. నిజమండీ బాబు.. ఆయనలో ఈ యాంగిల్కు ఇప్పుడు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అయితే ఆయన పాటలు ఎప్పటి నుంచో రాస్తున్నా.. ఇప్పుడు అందులో ఓ పాట విడుదల కావడంతో ఈ విషయం బయటకు వచ్చింది. ఇంతకీ ఆయన రాసిన పాట ఏంటో తెలుసా..?
శరన్నవరాత్రుల సందర్భంగా ప్రదర్శించే గుజరాత్ నృత్యమైన గర్బాపై గతంలో ప్రధాని మోదీ కవిత రాశారు. ఇప్పుడు ఆ కవిత మ్యూజిక్ వీడియో రూపంలో విడుదలైంది. ఈ పాటను బాలీవుడ్ సింగర్ ధ్వని భానుశాలీ ఆలపించగా.. తనిష్క్ బాగ్చీ మ్యూజిక్ అందించారు. ఈ సందర్భంగా సింగర్ ధ్వని, మ్యూజిక్ డైరెక్టర్ తనిష్క్, జేజస్ట్ మ్యూజిక్ సంస్థకు మోదీ అభినందనలు తెలిపారు.
‘నా సాహిత్యంతో గార్బా పాటను అందించినందుకు ధన్యవాదాలు. చాలా రోజుల క్రితం నేను రాసిన పాట ఇది. గత జ్ఞాపకాలను ఇది నాకు గుర్తు చేసింది. కొన్ని ఏళ్లుగా నేను ఏ పాటనూ రాయలేదు. చాలా రోజుల తర్వాత ఈ మధ్యే ఓ పాటకు లిరిక్స్ రాశా. నవరాత్రి సందర్భంగా దాన్ని మీతో పంచుకుంటా’ అని మోదీ ట్వీట్ చేశారు.