రైలు కిందపడి తల్లీకుమార్తె ఆత్మహత్య

రైలు కిందపడి తల్లీకుమార్తె ఆత్మహత్య

రైలు కిందపడి తల్లీకుమార్తె ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన వేలూరు సమీపంలో చోటుచేసుకుంది. వేలూరు సమీపంలోని విరింజిపురం గ్రామానికి చెందిన రాజేశ్‌కుమార్‌ మేఘాలయలో ఆర్మీ అధికారి. ఇతని భార్య జయంతి(29), కుమార్తె నందిత(4) సొంత గ్రామంలో ఉంటున్నారు. రాజేశ్‌కుమార్‌ 20 రోజుల క్రితం సెలవుపై వచ్చాడు.

ఈ క్రమంలో దంపతుల మధ్య శనివారం రాత్రి గొడవ చోటుచేసుకుంది. దీంతో మనస్తాపం చెంది జయంతి ఆదివారం ఉదయం కుమార్తె నందితతో కలిసి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. తల్లి, కుమార్తె ఇద్దరూ కలిసి విరింజిపురం వద్ద రైలు వచ్చే సమయంలో రైలు పట్టాలపై నిలబడ్డారు. రైలు ఢీకొని తల్లీ కుమార్తె ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.