అల్లుడిపై కిరోసిన్‌ పోసి నిప్పంటించిందో అత్త

అల్లుడిపై కిరోసిన్‌ పోసి నిప్పంటించిందో అత్త

తన కూతురిని వేధిస్తున్నాడన్న కోపంతో అల్లుడిపై కిరోసిన్‌ పోసి నిప్పంటించిందో అత్త. భర్తపై జరిగిన అఘాయిత్యాన్ని అడ్డుకోవాల్సింది పోయి ఆమె కుమార్తె కూడా సహకరించింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితుడు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతిచెందాడు. సికింద్రాబాద్ అడ్డగుట్ట పోచమ్మ దేవాలయం వద్ద నివసించే దండుగళ్ల నాని (28) కారు డ్రైవర్‌‌గా పనిచేస్తున్నాడు. మల్కాజిగిరి పీఎస్ పరిధిలోని జేఎల్‌ఎన్‌ఎస్‌ నగర్‌లో నివసించే అనిత అలియాస్‌ సోని(26)తో 2015లో వివాహం జరిగింది.

వీరికి నాలుగేళ్ల కుమార్తె హసిని ఉంది.కొంతకాలంగా మద్యానికి బానిసైన నాని రోజూ తాగొచ్చి భార్యను వేధించేవాడు. ఎన్నిరోజులు ఓపికపట్టినా అతడిలో మార్పు రాకపోవడంతో సోనీ తొమ్మిది నెలల క్రితం మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేసి పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటినుంచి తల్లితో పాటే ఈ క్రమంలో ఈ నెల 13న కుమార్తెను చూసేందుకు నాని ఆమె వద్దకు వచ్చాడు.ఆ సమయంలో అత్త, అల్లుడి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

అల్లుడు మాటలకు ఆగ్రహం చెందిన అత్త తిరుపతమ్మ అలియాస్‌ పార్వతమ్మ(45), కుమార్తెతో కలిసి అతడిపై కిరోసిన్‌ పోసి నిప్పంటించింది. మంటల్లో కాలుతూ అతడు కేకలు పెట్టడంతో స్థానికులు రక్షించి గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే శరీరం తీవ్రంగా కాలిపోవడంతో అతడు బ్రతకడం కష్టమని డాక్టర్లు తెలిపారు. ఈ క్రమంలోనే గాంధీలో చికిత్స పొందుతూ శనివారం అర్థరాత్రి నాని మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.