మనాలీలో ఉండగా ముంబై పోలీసులు ఫోన్…

మనాలీలో ఉండగా ముంబై పోలీసులు ఫోన్...

బాలీవుడ్‌ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తరువాత సినీ పరిశ్రమలో నెపోటిజంపై గొంతెత్తిన బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్‌ మరోసారి సంచలనం సృష్టించారు. ఈ విషయంలో తన వాదనలను నిరూపించుకోలేకపోతే తన పద్మశ్రీని పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేస్తానని ప్రకటించారు. ఒక హిందీ టీవీ చానల్‌తో మాట్లాడుతూ కంగనా ఈ విషయాన్ని వెల్లడించారు.

సుశాంత్‌ కేసు విచారణలో భాగంగా ముంబై పోలీసులు తాను మనాలీ ఉండగా ఫోన్‌ చేశారనీ, అయితే తన స్టేట్‌మెంట్‌ను తీసుకోవడానికి ఎవరినైనా పంపించాలని కోరినా ఎవరూ రాలేదని వివరించారు అయితే ఈ విషయంలో తాను ఏం మాట్లాడినా బహిరంగంగానే మాట్లాడనని, తాను పారిపోయే మనషిని కాదని స్పష్టం చేశారు. తన విమర్శలను నిరూపించుకోలేకపోతే, పద్మశ్రీ అవార్డును ఉంచుకునే అర్హత తనకుండదని ఆమె పేర్కొన్నారు.

జూన్ 14న సుశాంత్ ఆత్మహత్య యావత్‌ సినీలోకాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. అలాగే పరిశ్రమలో నెపోటిజంపై అనేక విమర్శలు చెలరేగాయి. ప్రధానంగా మహేష్‌ భట్‌, కరన్‌జోహార్‌ లాంటి నిర్మాతలపై కంగనా ఘాటు విమర్శలు గుప్పించారు. అలాగే సుశాంత్‌ది ఆత్మహత్యా లేక పథకం ప్రకారం జరిగిన హత్యా అంటూ బాలీవుడ్ పరిశ్రమ తీరుపై కంగనా ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.