అక్కినేని నాగచైతన్య, సమంతలు పెళ్లికి ముందు ‘ఏమాయ చేశావే’, ‘ఆటోనగర్ సూర్య’, ‘మనం’ చిత్రాలతో ఆకట్టుకున్నారు. పెళ్లి తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నాగచైతన్య, సమంతలు పెళ్లి అయినప్పటి నుండి వేరు వేరుగా చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఎట్టకేలకు వీరిద్దరి కాంబో మూవీ రాబోతుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. మొదట నాగచైతన్య చిత్రంలో సమంత ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతుందని, ఆ తర్వాత హీరోయిన్ అంటూ పలు వార్తలు షికార్లు చేశాయి. చివరకు చిత్ర యూనిట్ సభ్యులు అధికారిక ప్రకటన చేశారు.
షైన్ స్క్రీన్ బ్యానర్లో నాగచైతన్య మరియు సమంత జంటగా శివ నిర్వాన దర్శకత్వంలో ఒక చిత్రం తెరకెక్కబోతుంది అంటూ అధికారిక ప్రకటన వచ్చింది. ప్రొడక్షన్ నెం.2లో ఈ చిత్రం రూపొందబోతుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రం అతి త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతుంది. ఇక ఈ చిత్రం ఒక విభిన్న ప్రేమ కథాంశంతో తెరకెక్కబోతుంది. కోన వెంకట్ ఈ చిత్రంకు సమర్పకుడిగా వ్యవహరించబోతున్నాడు. నాని ‘నిన్ను కోరి’ చిత్రంతో దర్శకుడిగా విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న శివ నిర్వాన ఈ చిత్రంతో మరో విజయాన్ని సొంతం చేసుకుంటాడేమో చూడాలి.