ప్రపంచాన్ని భయపెడుతున్న కొత్త వైరస్

ప్రపంచాన్ని భయపెడుతున్న కొత్త వైరస్

ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ భారత్‌లో లేదని కేంద్ర ప్రకటించింది ప్రకటించింది. కొత్త కరోనా విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. కొత్త స్ట్రెయిన్ వేగంగా వ్యాపిస్తున్నప్పటికీ వ్యాధి తీవ్రతలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో నీతి అయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ కొత్త వైరస్‌కు సంబంధించి కీలక విషయాలు వెల్లడించారు. కరోనా వైరస్ కట్టడి కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌కు కూడా వీకే పాల్ నేతృత్వం వహిస్తున్నారు.

ఈ సందర్భంగా కొత్త కరోనాలోని జన్యుమార్పులు గురించి వీకే పాల్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వాతావరణంలో చోటుచేసుకుంటున్న తాజాగా మార్పుల వల్ల వ్యాధి వేగంగా వ్యాపిస్తోందని పేర్కొన్నారు. అయితే వ్యాధి తీవ్రతలో ఎలాంటి మార్పు లేదని ఆయన స్పష్టం చేశారు. అలాగే కొత్త కరోనా కారణంగా మరణించే అవకాశం పెరగలేదని కేంద్ర ఆరోగ్య శాఖ సెక్రెటరీ రాజేష్ భూషణ్ తెలిపారు. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ వైరస్ విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.

ఇప్పటి వరకు తాము వెయ్యికి పైగా కేసుల్లో కరోనా శాంపిళ్లను పరీక్షించినా.. కొత్త కరోనా ఆనవాళ్లు కనిపించలేదని ఆయన తెలిపారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కేంద్రం ఇప్పటికే అనేక బ్రిటన్‌కు విమాన సర్వీసులను డిసెంబర్ 31 వరకు నిలిపివేసిన విషయం తెలిసిందే.

కాగా, యూకే నుంచి ఢిల్లీ చేరుకున్న వారిలో ఇప్పటివరకు ఐదుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఢిల్లీ నుంచి కోల్‌కతా వచ్చిన ఇద్దరికి, చెన్నై చేరుకున్న మరో వ్యక్తికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. బెంగళూరులో బ్రిటన్ నుంచి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప తెలిపారు. ముంబైలో మరో వ్యక్తికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. బ్రిటన్ నుంచి వచ్చే ప్రయాణికులందరికీ విమానాశ్రయాల్లోనే కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు.