బాబుకి మళ్ళీ కొత్త తలనొప్పి రేపిన జేసీ !

టీడీపీ అభ్యర్థుల ఎంపిక కమిటీపై అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఆఫ్ ది రికార్డ్ అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అనంతపురం పార్లమెంటు పరిధిలోని కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చాలని ఆయన స్క్రీనింగ్ కమిటీని కోరినట్టు సమాచారం. దీని మీద శుక్రవారం అమరావతిలోని కమిటీని కలిసిన ఆయన పలువురు అభ్యర్థిత్వాలపై అభ్యంతరం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇదే అంశాన్ని మీడియా ముందు ఆయన పరోక్షంగా వెల్లడించారు. ఉండవల్లిలోని ప్రజావేదిక వద్ద మీడియాతో మాట్లాడుతూ అనంతపురం నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో టీడీపీని గెలిపించాలన్నదే నా లక్ష్యమన్నారు. మా కుటుంబంలో ఎవరు పోటీలో ఉన్నా గెలుపే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పుకొచ్చారు. కొందరి గెలుపుపై తమకు అనుమానాలున్నాయని, వారి అభ్యర్థిత్వాల విషయంలో పునరాలోచించు కోవాలని స్క్రీనింగ్‌ కమిటీకి స్పష్టంగా చెప్పానని జేసీ పేర్కొన్నారు. వారిని మారిస్తేనే ఎంపీగా గెలుస్తామని, మేము ఓడిపోడానికి సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. అంతేకాదు పార్టీ మారే ప్రసక్తేలేదని, అభ్యర్థులను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన తర్వాత పోటీలో ఉండాలా ? లేదా ? అన్నది నిర్ణయించుకుంటామని కుండబద్దలుకొట్టారు. శింగమనల, కల్యాణదుర్గం, గుంతకల్లు అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల మార్పు మీద ఆయన పట్టుబడుతున్నారు. వీరితోపాటు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరితో వైరం కారణంగా ఆయన కూడా గెలిచే అవకాశం లేదంటూ చంద్రబాబుకు తెలిపినట్టు తెలుస్తోంది. ఈ కారణాలతోనే అనంతపురం పార్లమెంటు పరిధిలోని స్థానాలను పెండింగ్‌లో పెట్టినట్టు సమాచారం. చూడాలి అనంత రాజకీయం ఎన్ని మలుపులు తిరుగుతుందో ?