ఉత్తరప్రదేశ్‌లో రాజకీయం రోజుకో మలుపు

ఉత్తరప్రదేశ్‌లో రాజకీయం రోజుకో మలుపు

ఉత్తరప్రదేశ్‌లో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్నవేళ అన్ని పార్టీల్లో నేతల పార్టీ చేరికల పర్వం కొనసాగుతోంది. తాజాగా సమాజ్‌వాదీ పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎస్పీ వ్యవస్థపక అధ్యక్షుడు, మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ తోడల్లుడు మాజీ ఎమ్మెల్యే ప్రమోద్ గుప్తా గురువారం బీజేపీలో చేరారు.

బుధవారం ములాయంసింగ్‌ యాదవ్‌ సవతి కుమారుడు ప్రతీక్‌ యాదవ్‌ భార్య అయిన అపర్ణా యాదవ్‌ బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ప్రమోద్‌ గుప్తాతో పాటు కాంగ్రెస్ పార్టీ మాజీ నేత ప్రియాంక మౌర్య కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ప్రియాంక గాంధీ వాద్రా నేతృత్వంలో కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన ‘లడ్కీ హూన్, లడ్ సక్తి హూన్’ ప్రచారంలో ప్రియాంక మౌర్య పోస్టర్‌ గర్లగా ఉండి కీలకంగా వ్యవహరించారు.

బీజేపీలో ఆమె చేరిక కాంగ్రెస్‌ పార్టీకి నష్టం కలగనుందని రాజకీయ విశ్లేషకులు చర్చిస్తున్నారు. ఇప్పటికే ముగ్గురు మంత్రులు సహా పలువురు ఎమ్మెల్యేలు పార్టీని వీడటంతో ఓబీసీ వర్గాల్లో ఇబ్బంది పడుతున్న బీజేపీకి ములాయం చిన్న కోడలు బీజేపీలో చేరడం కాస్త ఉపశమనం కలిగించే అంశంగా మారింది.