మహిళల వస్త్రధారణపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ప్రధాని

మహిళల వస్త్రధారణపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ప్రధాని

మహిళల వస్త్రధారణపై పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలు ధరించే దుస్తుల వల్లే దేశంలో అత్యాచారాలు పెరిగిపోతున్నాయని అన్నారు. మహిళలు తమ వస్త్రధారణతో మగవారి మనసు చెదిరేలా చేస్తున్నారని.. ఫలితంగా అత్యాచార కేసులు పెరుగుతున్నాయంటూ ఇమ్రాన్‌ ఖాన్‌ ఓ అంతర్జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

‘‘మహిళలు పొట్టి దుస్తులు ధరిస్తే.. మగవారిపై ఆ ప్రభావం కచ్చితంగా ఉంటుంది. స్త్రీలు తమ శరీరం కనిపించేలా దుస్తులు ధరిస్తే మగవారి మనస్సు చలిస్తుంది. పురుషులు రోబోలు అయితే తప్ప.. వారు చలించకుండా ఉండరు. ఎందుకంటే మనం నివసిస్తున్న సమాజం పూర్తిగా భిన్నమైంది. ఇక్కడ ఎలా నడుచుకోవాలనే ఇంగిత జ్ఞానం మనకే ఉండాలి’’ అని వ్యాఖ్యానించారు. అయితే, ఆయన వ్యాఖ్యలపై జర్నలిస్టులు, ప్రతిపక్ష నేతలు మండిపడ్డారు.

పాకిస్తాన్‌లో పెరిగిపోతున్న అఘాయిత్యాలను మహిళల వస్త్రధారణతో ఇమ్రాన్ మరోసారి ముడిపెట్టడం చాలా దారుణం అని ఇంటర్నేషనల్ కమిషన్ ఆఫ్ జూరిస్ట్స్ లీగల్ అడ్వైజర్ రీమా ఒమర్ అసహనం వ్యక్తం చేశారు. అయితే, ఆయన వ్యాఖ్యలను వక్రీకరించారని ఇమ్రాన్ సోషల్ మీడియా వ్యవహారాలు చూసే అధికార ప్రతినిధి డాక్టర్ అర్ స్లాన్ ఖాలిద్ అన్నారు.

ఇమ్రాన్‌ అన్నదానిని పూర్తిగా చెప్పకుండా కేవలం ఒక వాక్యాన్ని పట్టుకుని రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. మనం ఎలాంటి సమాజంలో బతుకుతున్నామో.. లైంగిక వాంఛలు ఏ స్థాయికి వెళ్లాయో ప్రధాని చెప్పారన్నారు. కాగా, ఈ ఏడాది ఏప్రిల్ లోనూ ఇమ్రాన్ ఇలాంటి వ్యాఖ్యలే చేసి అభాసుపాలయిన సంగతి తెలిసిందే.