దురద తగ్గట్లేదని వైద్యం చేస్తున్న డాక్టర్ భార్యను ఘోరంగా చంపేశారు

patient killed doctors wife

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ లో ఓ విచిత్రమైన సంఘటన జరిగింది. దురదతో బాధపడుతున్న ఓ వ్యక్తి ఆస్పత్రిలో వైద్యం చేయించినా తగ్గకపోవడంతో వైద్యం చేసిన డాక్టర్ భార్యను దారుణంగా హత్య చేశాడు. డాక్టర్ కుమారుడిని చంపాలని ప్రయత్నించగా అతను తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో గురువారం జరిగిన ఘటనకి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రషీద్ తీవ్రమైన దురదతో బాధపడుతున్నారు. అయితే ఆరు నెలలుగా డాక్టర్ రామకృష్ణ వర్మ క్లినిక్‌లో వైద్యం చేయించుకుంటున్నాడు. అయితే దురదలో ఎలాంటి మార్పూ రాలేదు. దీంతో తీవ్ర అసహనానికి గురైన రషీద్ రామకృష్ణ భార్య లత(50), కుమారుడు అభిషేక్(19)లపై కత్తితో దాడి చేసి పారిపోయాడు. ఆ సమయంలో తల్లీకొడుకుల ఆర్తనాదాలు విన్న పొరుగింటి వారు ఘటనా స్థలానికి చేరుకొని రక్తపు మడుగులో ఉన్న వారిద్దర్ని ఆస్పత్రికి తరలించారు. డాక్టర్ భార్య లత అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడి కోసం గాలిస్తున్నారు. మరోవైపు హత్యకు పాల్పడిన రషీద్ గతంలో ఓ హత్యకేసులో నిందితుడని పోలీసులు చెబుతున్నారు.