లాక్‌డౌన్‌ను సీరియస్‌గా తీసుకోవడం లేదు

లాక్‌డౌన్‌ను సీరియస్‌గా తీసుకోవడం లేదు

లాక్‌డౌన్‌ను ప్రజలు సీరియస్‌గా తీసుకోవడం లేదు. ఉదయం 10 గంటల తర్వాత ప్రజలు, వాహనదారులు బయటకు రావద్దని పోలీసులు సూచిస్తున్నా కొందరు హెచ్చరికలను పట్టించుకోకుండా బయట యథేచ్ఛగా తిరుగుతున్నారు. సోమవారం మలక్‌పేట్, మహేశ్వరం జోన్‌ పరిధిలోని ప్రధాన రహదారులపై లాక్‌డౌన్‌ ఉన్నా అవేమీ తమకు పట్టవన్నట్లు ప్రజలు రోడ్లపై తమ వాహనాలతో తిరిగారు.

కొందరు నిత్యావసర వస్తువుల కోసం రోడ్లపైకి రాగా, యువత తమ స్నేహితులను కలిసేందుకు బయటకు వచ్చారు. ఇంట్లో ఉన్న పాత మందుల చిట్టీలను తీసుకొని పోలీసులకు చూపిస్తు రోడ్లపై తిరుగుతున్నారు. అవసరం ఉన్నా లేకున్నా యువకులు రోడ్లపై తిరుగుతుండటంతో అత్యవసర పనుల మీద వెళ్లేవారు ఇబ్బందులు పడుతున్నారు.

దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట్, కొత్తపేట్, సరూర్‌నగర్, సైదాబాద్‌ తదితర ప్రాంతాలలో రోడ్లపై వాహనాల సందడి ఎక్కువగా కనిపించింది.రోడ్లపై తిరిగే వారితో కోవిడ్‌ మరింత విజృంభించే అవకాశాలు ఉన్నందున లాక్‌డౌన్‌ను మరింత పటిష్టంగా అమలు చేయాలని పలువురు కోరుతున్నారు.పెట్రోల్‌ బంకులు మూసివేశారు. దీంతో అత్యవసర పనులపైన బయటకు వచ్చిన వారు పెట్రోల్‌ కోసం ఇబ్బందులు పడ్డారు. నిత్యావసరాలను కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆయా షాపుల వద్ద క్యూ కట్టారు.