భారీ విరాళం ప్రకటించిన ప్రభాస్

భారీ విరాళం ప్రకటించిన ప్రభాస్

ప్రపంచ దేశాలు కరోనా మహమ్మారిపై యుద్ధాన్ని ప్రకటించాయి. వీటిలో భారత్ కూడా ఉంది. కరోనాపై యుద్ధమంటే కేవలం ఎవరి ఇంట్లో వాళ్లు కూర్చొని చేయాల్సిందే. జనసమూహానికి దూరంగా ప్రజలు వారి ఇళ్లలో భద్రంగా ఉండటమే కరోనాపై చేసే పోరాటం. నిన్న మొన్నటి వరకు ఈ సూచనలతో ప్రజలను చైతన్యం చేసిన సినీ తారలు.. ఇప్పుడు కరోనా వైరస్‌ను పూర్తిగా నిర్మూలించే ప్రయత్నంలో ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధులకు తమ వంతు బాధ్యతగా భారీ విరాళాలు అందజేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధులకు కలిపి ఇప్పటికే పవన్ కళ్యాణ్ కోటి రూపాయలు (పీఎం రిలీఫ్ ఫండ్‌కు మరో కోటి రూపాయలు), మహేష్ బాబు కోటి రూపాయలు, రామ్ చరణ్ 70 లక్షల రూపాయలు, నితిన్ 10 లక్షల రూపాయలు, దర్శకుడు త్రివిక్రమ్ రూ. 20 లక్షలు, దర్శకుడు అనిల్ రావిపూడి రూ. 10 లక్షలు, దిల్ రాజు రూ.10 లక్షలు ప్రకటించగా.. ఇప్పుడు వీళ్ల జాబితాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ చేరారు. సాయి ధరమ్ తేజ్ రూ.10 లక్షలు ప్రకటించగా.. ప్రభాస్ మాత్రం ఎవ్వరూ ఊహించని రీతిలో రూ. 4 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించారు.

ఈ రూ.4 కోట్లలో ప్రధాన మంత్రి సహాయ నిధికి రూ.3 కోట్లు విరాళంగా ఇస్తుండగా.. ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్‌కి, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కి రూ. 50 లక్షల చొప్పున ఇస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు టాలీవుడ్ పలువురు పీఆర్‌వోలు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. నిజానికి మొదట ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు కలిపి కోటి రూపాయలు విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించారు. కానీ, గురువారం అర్ధరాత్రి సమయంలో మరో ప్రకటన వచ్చింది. ప్రధాన మంత్రి సహాయ నిధికి కూడా రూ.3 కోట్లు విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించారు. కరోనా వైరస్‌పై పోరాటం కోసం తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఇప్పటి వరకు ఇదే అత్యధిక విరాళం.