యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సుజీత్ దర్శకత్వంలో ‘సాహో’ చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని ప్రభాస్ సన్నిహితులు వంశీ మరియు ప్రమోద్లు దాదాపు 300 కోట్ల బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ బడ్జెట్ నెంబర్ మరింత పెరిగినా ఆశ్చర్య పోనక్కర్లేదు అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు. ఇంత భారీ బడ్జెట్ను ప్రభాస్ రికవరీ చేయగలడా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బాహుబలి చిత్రంతో ప్రబాస్కు మంచి క్రేజ్ దక్కిన మాట నిజమే, కాని రాజమౌళి ఉంటేనే ప్రభాస్కు ఆ స్థాయిలో గుర్తింపు దక్కింది. రాజమౌళి లేకుండా ప్రభాస్ ‘సాహో’ చిత్రంతో భారీ వసూళ్లు సాధించడం అంటే అనుకున్నంత ఈజీ విషయం ఏమీ కాదు. అయితే బాలీవుడ్లో మరియు ఇతర ప్రాంతాల్లో భారీ ఎత్తున ఈ చిత్రాన్ని విడుదల చేయడం వల్ల 500 కోట్లను సునాయాసంగా రాబట్టవచ్చు అనేది సాహో నిర్మాతల ప్లాన్గా తెలుస్తోంది.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ‘సాహో’ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా 10 వేల థియేటర్లలో విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకు సంబంధించిన చర్చలు ఇప్పటి నుండే జరుగుతున్నాయి. బాలీవుడ్లో భారీ ఎత్తున సినిమాను విడుదల చేయాలి అంటే కనీసం 10 నెలల ముందే డేట్ను అనౌన్స్ చేయాల్సి ఉంటుంది. అలా చేస్తేనే థియేటర్లను బుక్ చేయగలరు. హిందీ సాహో రైట్స్ను టీసిరీస్ వారు దక్కించుకున్నారు. దాదాపుగా 3 వేల థియేటర్లలో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాలు మరియు తమిళనాడు, కేరళలో కూడా భారీ ఎత్తున విడుదల చేయాలని భావిస్తున్నారు. ఎంతగా ప్రయత్నించినా కూడా 10 వేల థియేటర్లలో ఈ చిత్రం అంటే మామూలు విషయం కాదని, అంత సీన్ ‘సాహో’కు లేదు అంటూ ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 5 వేల థియేటర్లలో ఈ చిత్రం విడుదలైనా కూడా వారం పది రోజుల్లో పెట్టిన పెట్టుబడి వస్తుందని, అయితే సినిమాకు పాజిటివ్ టాక్ వస్తేనే అది సాధ్యం అవుతుందని విశ్లేషకులు అంటున్నారు.