వైద్యుల నిర్లక్ష్యంతో నిండు గర్భిణీ మృతిచెందిందంటూ నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి తండా, కౌడిపల్లి మండలం తిమ్మాపూర్ పంచాయతీ పరిధిలోని కుషన్ గూడ తండాలకు చెందిన గిరిజనులు బుధవారం నర్సాపూర్ ఏరియా ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న నర్సాపూర్ ఎస్సై గంగరాజు పోలీసులతో అక్కడికి చేరుకొని చెదరగొట్టారు. ఈ సందర్భంగా మృతురాలు కుటుంబ సభ్యులు బంధువులు మాట్లాడుతూ నిండు గర్భిణీ అయిన ధారవత్ సునీతను (27) ఈ నెల 1వ తేదీన ఆమె భర్త రాజు ఇతర కుటుంబ సభ్యులు ప్రసవం కోసం నర్సాపూర్ ఏరియా ఆస్పత్రికి తీసుకువచ్చి చేర్పించారు.
మంగళవారం రాత్రి సునీతకు లోబీపీతో పాటు తీవ్ర రక్తస్రావం కావడంతో వెంటనే సంగారెడ్డి ఆస్పత్రికి తరలించాలని వైద్యులు సూచించడంతో కుటుంబ సభ్యులు సంగారెడ్డి ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించాలని సూచించారు. అక్కడి నుంచి గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో సునీతా మృత్యువాత పడినట్లు చెప్పారు. నర్సాపూర్ ఆస్పత్రిలో వైద్యుల సరిగా చూడక పోవడంతోనే సునీతా మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. మృతురాలు సునీతాకు ఐదేళ్ళ కూతురు ఉంది.