శ్రావణి ఆత్మహత్య కేసులో నిర్మాత అరెస్ట్

శ్రావణి ఆత్మహత్య కేసులో నిర్మాత అరెస్ట్

సంచలనం రేపిన టీవీ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో హైదరాబాద్ పోలీసులు మరో వ్యక్తిని అరెస్టు చేశారు. ఆ వ్యక్తి బ్లాక్‌బస్టర్ మూవీ ‘ఆర్ఎక్స్ 100’ నిర్మాత అశోక్ రెడ్డి గుమ్మకొండ కావడం గమనార్హం. ఈ కేసులో మూడో ప్రధాన నిందితుడిగా ఉన్న అశోక్ రెడ్డి పరారీలో ఉన్న విషయం తెలిసిందే. తాజాగా అశోక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.

శ్రావణి ఆత్మహత్య కేసులో ఎ-1గా ఉన్న దేవరాజ్ రెడ్డి, ఎ-2 గా సాయిరెడ్డిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. వీరితో పాటు అశోక్ రెడ్డి పలు రకాలుగా శ్రావణిని వేధించడం వల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. చనిపోవడానికి ముందు శ్రావణికి సంబంధించిన వీడియోలు, ఆడియోల్లో వీరి పేర్లు ప్రధానంగా ప్రస్తావనకు వచ్చాయి.

ఈ కేసులో తన పేరు బయటికి రాగానే అశోక్ రెడ్డి అప్రమత్తం అయ్యాడు. సోమవారం రోజున విచారణకు వస్తానని చెప్పిన నిర్మాత అశోక్ రెడ్డిమాత్రం పోలీసుల కళ్ళుగప్పి తప్పించుకునే ప్రయత్నం చేసాడు. పైగా సెల్‌ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఐతే పోలీసులు అతనెక్కడున్నది ట్రేస్ చేసి అరెస్టు చేశారు. అశోక్ రెడ్డి వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ కేసులో పోలీసులు 17 మంది సాక్షులను విచారించారు. పోలీసుల అదుపులో ఉన్న దేవరాజ్ రెడ్డి, సాయికృష్ణలను పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

‘మనసు మమత’ సహా కొన్ని సీరియళ్లలో నటించిన శ్రావణి ముందుగా సాయికృష్ణారెడ్డితో ప్రేమలో ఉంది. అతనే ఆమెకు సీరియళ్లతో పాటు సినిమాల్లో కూడా అవకాశం ఇప్పించినట్లు తెలుస్తోంది. అతడి ద్వారానే అశోక్ రెడ్డి నిర్మించిన ‘ప్రేమతో మీ కార్తీక్’ సినిమాలోనూ శ్రావణి అవకాశం దక్కించుకుంది. అప్పట్నుంచి శ్రావణిని అశోక్ రెడ్డి లొంగదీసుకునే ప్రయత్నం చేశాడని, ఆమె కూడా ఒక దశలో అతడితో చనువుగా ఉందని వార్తలు వచ్చాయి. మరి శ్రావణి ఆత్మహత్యకు సంబంధించి పోలీసుల విచారణలో ఈ ముగ్గురి ప్రమేయం గురించి చివరికి ఏం తేలుతుందో చూడాలి.