ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన పురందేశ్వరి

ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన పురందేశ్వరి

దగ్గుబాటి కుటుంబం రాజకీయ భవిష్యత్‌పై కొద్దిరోజులుగా గందరగోళం ఏర్పడింది. పర్చూరు వైఎస్సార్‌సీపీ ఇంఛార్జ్‌గా ఉన్న వెంకటేశ్వరరావు ఉండగానే రావి రామనాథంబాబును మళ్లీ పార్టీలోకి తీసుకురావడం.. ఆయనకు ప్రాధాన్యం ఇవ్వడం చకచకా జరిగాయి. దీంతో దగ్గుబాటి రాజకీయ భవిష్యత్ కాస్త అయోమయంలో పడింది. అంతేకాదు పురందేశ్వరి వైఎస్సార్‌సీపీలోకి రావడం.. లేని పక్షంలో వెంకటేశ్వరరావు పార్టీ నుంచి తప్పుకోవాలనే సంకేతాలను పరోక్షంగా ఇచ్చింది. దీంతో అనుచరులతో దగ్గుబాటి చర్చించారు.. వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేయాలని దాదాపు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై క్లారిటీ కూడా రావాల్సి ఉంది.

ఇదిలా ఉంటే తనను వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వానించడంపై పురందేశ్వరి స్పందించారు. పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న ఆమె.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనను వైఎస్సార్‌సీపీలో చేరాలని ఎన్నికలకు ముందు ఆహ్వానం వచ్చిందని పురందేశ్వరి చెప్పుకొచ్చారు. ప్రస్తుతమైతే తనకు ఆ పార్టీ నుంచి ఎలాంటి ఆహ్వానం రాలేదన్నారు పురందేశ్వరి.

తన భర్త వెంకటేశ్వరరావు వైఎస్సార్‌సీపీలో చేరడానికి ముందు.. తాను బీజేపీలోనే కొనసాగుతానని స్పష్టంగా చెప్పానన్నారు పురందేశ్వరి. ఈ విషయాన్ని వైఎస్సార్‌సీపీ నేతలకు కూడా క్లారిటీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. దీనికి అంగీకరించడంతోనే భర్త వెంకటేశ్వరరావు, కుమారుడు హితేష్ వైఎస్సార్‌సీపీలో చేరారని చెప్పుకొచ్చారు. ఇక వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేయాలని వెంకటేశ్వరరావుపై ఒత్తిడి తెస్తున్న విషయాన్ని ప్రస్తావించగా.. అది ఆయన్నే అడగాలని పురందేశ్వరి అన్నారు.