లేదు లేదు అంటూనే చేసేస్తున్నాడు

Rajinikanth Doing One More Movie

సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ ‘రోబో’ చిత్రం తర్వాత తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. ఆ సమయంలోనే రజినీకాంత్‌ ఇక సినిమాలు చేయలేడేమో అంటూ వార్తలు వచ్చాయి. అయితే చాలా గ్యాప్‌ తీసుకున్న తర్వాత ‘లింగ’ చిత్రంతో రజినీకాంత్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ తర్వాత ‘కబాలి’, ‘కాలా’ చిత్రాలు చేశాడు. రోబో సినిమా తర్వాత పెద్దగా సక్సెస్‌లు లేకపోయినా కూడా సినిమా సినిమాకు అధిక పారితోషికం అందుకుంటున్న రజినీకాంత్‌ తాజాగా మరో రెండు సినిమాలకు కమిట్‌ అయ్యాడు. ‘కాలా’ విడుదలకు ముందే పిజ్జా ఫేం కార్తీక్‌ సుబ్బరాజు దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేసేందుకు రజినీకాంత్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. ఆ సినిమాలో కాజల్‌ హీరోయిన్‌గా నటించబోతున్నట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా తమిళ సూపర్‌స్టార్‌ డైరెక్టర్‌తో రజినీకాంత్‌ ఒక సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు.

తమిళనాట మురుగదాస్‌కు ఏ స్థాయి క్రేజ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈయన చేసిన ప్రతి సినిమా కూడా భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. తెలుగులో చేసిన స్పైడర్‌ మినహా అన్ని సినిమాలు కూడా తెలుగు మరియు తమిళంలో భారీగా వసూళ్లు సాధించాయి. ఇంతటి రికార్డు ఉన్న మురుగదాస్‌ చాలా కాలంగా రజినీకాంత్‌తో సినిమా చేయాలని ఆశ పడుతున్నాడు. ఆ ఆశ ఇప్పుడు తీరేలా కనిపిస్తుంది. కార్తీక్‌ సుబ్బరాజు సినిమా పూర్తి కాకుండానే మురుగదాస్‌ దర్శకత్వంలో నటించేందుకు రజినీకాంత్‌ ఓకే చెప్పాడు. ఇటీవలే రజినీకాంత్‌ కుమార్తె ఐశ్వర్య మాట్లాడుతూ తన తండ్రి సినిమాలను తగ్గించుకుంటే బాగుంటుందని చెప్పుకొచ్చింది. ఆ సమయంలోనే తన కూతురు చెప్పినట్లుగా వింటాను అని, సినిమాలను తగ్గించుకుంటాను అంటూనే మురుగదాస్‌ చిత్రానికి ఓకే చెప్పాడు. వచ్చే సంవత్సరంలో రజినీకాంత్‌ రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.