ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన రకుల్ ప్రీత్ సింగ్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన రకుల్ ప్రీత్ సింగ్

డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. తన పరువుకు భంగం కలిగించేలా మీడియాలో వస్తున్న కథనాలను నిలిపివేసేలా ఆదేశించాలంటూ పిటిషన్‌లో పేర్కొంది. మీడియాలో తనపై ఎటువంటి కథనాలు ప్రసారం చేయకుండా సమాచార ప్రసారాల శాఖకు ఆదేశాలు జారీ చేయాలని రకుల్ న్యాయస్థానాన్ని కోరింది. ఆమె పిటిషన్‌ను స్వీకరించిన జస్టిస్ నవీన్ చావ్లా ధర్మాసనం విచారణ చేపట్టింది.

మీడియాలో వచ్చే కథనాలపై సుప్రీంకోర్టు కూడా కలగజేసుకోదని ఈ సందర్భంగా కోర్టు పేర్కొంది. మీడియా స్వీయ నియంత్రతలో కథనాలు ప్రసారం చేయాలని గతంలో సుప్రీంకోర్టు చేసిన సూచనలను జస్టిస్ చావ్లా ప్రస్తావించారు. ఈ సందర్భంగా సమాచార ప్రసారాల శాఖ, ప్రసార భారతి, న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ అసోసియేషన్, ప్రెస్ కౌన్సిల్‌కు కోర్టు నోటీసులు జారీచేసింది. వ్యక్తులపై కథనాలు ప్రసారం చేసేటప్పుడు స్వీయ నియంత్రణ పాటించాలని మీడియా సంస్థలకు ఢిల్లీ హైకోర్టు సూచించింది. రకుల్ వేసిన పిటిషన్‌ను ఫిర్యాదుగా పరిగణించి సంబంధిత శాఖలు చర్యలు తీసుకోవచ్చని హైకోర్టు తెలిపింది.

బాలీవుడ్ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో అతడి ప్రేయసి రియా చక్రవర్తి అరెస్ట్ కావడంతో డ్రగ్స్ లింకులు బయటపడిన సంగతి తెలిసిందే. విచారణలో ఆమె రకుల్‌, సారా అలీఖాన్ సహా మరికొందరి పేర్లు వెల్లడించినట్లు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరీ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో రకుల్‌పై మీడియాలో అనేక కథనాలు ప్రసారమవుతున్నాయి. దీంతో విసిగిపోయిన ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.