రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న మెగా వారసుడు

రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న మెగా వారసుడు

మెగా ఫ్యామిలీకి రాజకీయాలతో ఉన్న సంబంధం ఇప్పటిది కాదు. మెగాస్టార్ చిరంజీవి తన సొంత పార్టీతో రాజకీయ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి అనూహ్యంగా యూ టర్న్ తీసుకోగా.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ముందడుగేసి రాజకీయాల్లో దూసుకుపోతున్నారు. అప్పటినుంచి మెగా ఫ్యామిలీ రాజకీయాలంటే జనాల్లో అదో క్రేజ్. సరిగ్గా ఇదే పాయింట్ తీసుకొని తన సినిమాను ప్లాన్ చేస్తున్నారట పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్.

శంకర్- రామ్ చరణ్ కాంబోలో ఓ భారీ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండేలా ఇప్పటినుంచే ప్లాన్స్ చేస్తున్నారట శంకర్. భారీతనం ఉట్టిపడేలా, అదేవిధంగా ఈ మూవీ రామ్ చరణ్ కెరీర్‌లోనే భారీ సినిమా కావాలని ఆయన బలంగా ఫిక్సయ్యారట. ఈ మేరకు కథను మరింత సానబడుతున్నారట శంకర్. ఈ నేపథ్యంలో కథలో ఆసక్తికర పాయింట్ ఇదే అంటూ ఓ క్రేజీ న్యూస్ బయటకొచ్చింది.

సోషల్‌ మెసేజ్‌ ఉన్న కాన్సెప్ట్‌‌కి శంకర్‌ శైలిలో మెరుగులు దిద్దుతున్నారట. ఇందులో రామ్‌చరణ్‌ పోలీస్‌ వృత్తి నుంచి సడెన్‌గా రాజకీయాల్లోకి అడుగుపెట్టి వ్యవస్థను సంస్కరించే వ్యక్తిగా కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇదే ఈ మూవీలో బిగ్ ట్విస్ట్ అంటున్నారు. భారీ నిర్మాణ వ్యయంతో దిల్ రాజు ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

రామ్ చరణ్ కెరీర్‌లో 15వ చిత్రంగా రాబోతున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించనుంది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌లో మొదటివారంలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించి అక్టోబర్‌ నెలలో సెట్స్‌ మీదకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఆరు నెలల్లోనే షూటింగ్ ఫినిష్ చేసి వచ్చే ఏడాది రిలీజ్ చేయాలని శంకర్ ఫిక్సయినట్లు తెలుస్తోంది.