మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్న రామ్ గోపాల్ వర్మ

మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్న రామ్ గోపాల్ వర్మ

మెగా ఫ్యామిలీని అదే పనిగా టార్గెట్ చేస్తున్న రామ్ గోపాల్ వర్మపై మూడేళ్ల కిందట ‘ఖైదీ నంబర్ 150’ ప్రి రిలీజ్ ఈవెంట్లో నాగబాబు ఎలా విరుచుకుపడ్డాడో తెలిసిందే. అలాంటి నాగబాబు.. రామ్ గోపాల్ వర్మ సినిమా తీయడానికి ఒక ఐడియా ఇచ్చాడిప్పుడు. నాగబాబు చుట్టూ ముసురుకున్న ఓ వివాదమే వర్మ స్టోరీకి ఐడియా కావడం విశేషం. ఇంతకీ వర్మ సినిమా తీయబోయేది ఎవరి మీద అంటారా.. నాథూరాం గాడ్సే.

గాంధీని హతమార్చిన గాడ్సే మీద ఇటీవల నాగబాబు ఇటీవల పాజిటివ్ ట్వీట్లు వేయడం తెలిసిన సంగతే. గాంధీని చంపడం నేరమే అయినా.. గాడ్సే దేశభక్తిని శంకించలేమంటూ వ్యాఖ్యానించాడు నాగబాబు. ఆయన వాదనలో నిజం ఉన్నప్పటికీ జనాల్లోకి ఈ ట్వీట్లు వేరే రకంగా వెళ్లాయి. గాంధీని చంపిన హంతకుడిని దేశభక్తుడు అనడమేంటంటూ ఆయనపై చాలామంది విరుచుకుపడ్డారు.

ఐతే నాగబాబు వ్యాఖ్యలకు మద్దతుగా.. గాడ్సే గురించి విభిన్న కోణాలతో పోస్టులు పెట్టిన వాళ్లూ ఉన్నారు. ఈ సమాచారమంతా వర్మ చదివాడో ఏమో.. గాడ్సే మీద సినిమా తీయడానికి రెడీ అయిపోయాడు. తాజాగా ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో గాడ్సే మీద సినిమా తీయబోతున్నట్లు ప్రకటించాడు వర్మ. తాను గాడ్సేకు మద్దతుగా.. గాంధీని కించపరిచేలా సినిమా తీయబోనని.. పబ్లిక్ డొమైన్‌లో ఉన్న డాక్యుమెంట్ల ఆధారంగానే గాడ్సే సినిమా స్క్రిప్టు తయారు చేస్తున్నానని వర్మ తెలిపాడు.

ఈ సినిమాకు సెన్సార్ సమస్యలు వస్తాయనేమీ అనుకోవడం లేదని వర్మ అన్నాడు. వర్మ ఇలా ఆ సమయానికి చిన్నా పెద్ద అని తేడా లేకుండా చర్చల్లో ఉన్న ఏదో ఒక అంశాన్ని పట్టుకుని సినిమా అనౌన్స్ చేయడం కొత్తేమీ కాదు. ఇలా ఆయన అనౌన్స్ చేసిన సినిమాలన్నీ పట్టాలెక్కలేదు కూడా. మరి గాడ్సే మీద తీస్తానన్న సినిమా సంగతి ఏమవుతుందో చూడాలి.