ఐపీఎల్-13వ సీజన్లో భాగంగా రాజస్తాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని ముందుగా రాజస్తాన్ రాయల్స్ ను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. ఇది ఈ సీజన్లో రాజస్తాన్ రాయల్స్కు తొలి మ్యాచ్. కాగా, చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటికే మ్యాచ్ గెలిచి మంచి ఊపు మీద ఉంది.
ముంబై ఇండియన్స్తో జరిగిన ఆరంభపు మ్యాచ్లో సీఎస్కే శుభారంభం చేసి జోష్ మీద ఉంది. తాజాగా రాజస్తాన్తో జరుగుతున్న మ్యాచ్లో చెన్నైనే ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. కానీ గత మ్యాచ్ను గెలిపించిన అంబటి రాయుడు ఈ మ్యాచ్లో బరిలోకి దిగడం లేదు. పూర్తిఫిట్నెస్తో లేని కారణంగా రాయుడ్ని పక్కకు పెట్టినట్లు తెలుస్తోంది. రాయుడి స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ను జట్టులోకి తీసుకున్నారు.
ఇరు జట్ల మధ్య ఇప్పటివరకూ 22 మ్యాచ్లు జరగ్గా 14 మ్యాచ్ల్లో సీఎస్కే విజయం సాధించింది. ఇక మరో ఎనిమిది మ్యాచ్ల్లో రాజస్తాన్ గెలుపును అందుకుంది. చెన్నై అటు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బలంగా ఉంది. గతేడాది టైటిల్ను తృటిలో కోల్పోయిన జట్టు సీఎస్కే. మూడుసార్లు ఈ ట్రోఫీని ముద్దాడింది. ఎంఎస్ ధోని నేతృత్వంలోని సీఎస్కే పటిష్టమైన జట్లలో ఒకటి. ప్రతీ సీజన్లోనే బలంగా కనిపించే జట్టు చెన్నై సూపర్ కింగ్స్.
ఇప్పటివరకూ చెన్నై మూడు టైటిల్ను గెలిచిందంటే ధోని మ్యాజిక్ కెప్టెన్సీనే కారణం. జట్టును ఒత్తిడి నుండి బయటపడేసి గాడిలో పడేలా చేయడంలో ధోనిది సెపరేట్ స్టైల్. తాజా జట్టులో ధోనితో పాటు షేన్ వాట్సన్, డుప్లెసిస్, మురళీ విజయ్లు వారి ప్రధాన బ్యాటింగ్ బలం. ఇక డ్వేన్ బ్రేవో, రవీంద్ర జడేజా, సామ్ కరాన్ లాంటి ఆల్రౌండర్ ఉండటం ఆ జట్టుకు అదనపు బలం.