ఆర్సీబీ దే పైచేయి….

ఆర్సీబీ దే పైచేయి....

ఐపీఎల్‌లో భాగంగా ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ ముందుగా బ్యాటింగ్‌కు మొగ్గుచూపాడు. ఇప్పటివరకూ ఆర్సీబీ ఎనిమిది మ్యాచ్‌లకు గాను ఐదు మ్యాచ్‌ల్లో గెలిచింది. ఇక రాజస్తాన్‌ రాయల్స్‌ మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. అంతకముందు ఈ సీజన్‌ తొలి అంకం మ్యాచ్‌లో రాజస్తాన్‌పై ఆర్సీబీ ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచింది.

ఆ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లి అజేయంగా 72 పరుగులు సాధించడంతో పాటు పడిక్కల్‌ 63 పరుగులు చేశాడు. ఇక ఈ సీజన్‌లో గత ఐదు మ్యాచ్‌ల్లో ఆర్సీబీ మూడు విజయాలు సాధించగా, రాజస్తాన్‌ రాయల్స్‌ గత ఐదు మ్యాచ్‌ల్లో ఒకదాంట్లో మాత్రమే గెలిచింది. ఓవరాల్‌గా ఇరుజట్లు ఇప్పటివరకూ 21సార్లు తలపడగా రాజస్తాన్‌ రాయల్స్‌ 10సార్లు విజయం సాధించగా, ఆర్సీబీ 9 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఇక రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి.

ఇక ఇరుజట్ల ఆటగాళ్ల బలబలాల్లో ఆర్సీబీదే పైచేయిగా ఉంది. విరాట్‌ కోహ్లి 304 పరుగులు సాధించగా, పడిక్కల్‌ 261 పరుగులు చేశాడు. డివిలియర్స్‌ 230 పరుగులు చేశాడు. ఇక రాజస్తాన్‌ ఆటగాళ్లలో సంజూ శాంసన్‌ 227 పరుగులు చేయగా, రాహుల్‌ తెవాటియా 203 పరుగులతో ఉన్నాడు. ఇరుజట్ల అత్యధిక వికెట్ల జాబితాలో రాజస్తాన్‌ పేసర్‌ ఆర్చర్‌ 12 వికెట్లతో ఉండగా, ఆర్సీబీ స్పిన్నర్‌ 11 వికెట్లు సాధించాడు.

ఆర్సీబీ పేసర్‌ ఇసురు ఉదానా 7 వికెట్లను తీశాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లి -ఆర్చర్‌ల పోరు జరిగే అవకాశం ఉంది. కోహ్లి 126.66 ఉండగా, ఆర్చర్‌ ఎకానమీ 6.56గా ఉంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ రెండు మార్పులు చేసింది. శివం దూబే, సిరాజ్‌లకు విశ్రాంతి ఇచ్చారు. గుర్‌కీరత్‌ మన్‌, షహబాజ్‌ అహ్మద్‌లకు తుదిజట్టులో చోటు దక్కింది.ఇక రాజస్తాన్‌ ఎటువంటి మార్పులు లేకుండా పోరుకు సిద్ధమైంది.