జియో భారీ ప్రణాళిక

జియో భారీ ప్రణాళిక

ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్‌ జియో భారీ ప్రణాళికను రూపొందించింది. మొబైల్‌ నెట్‌వర్క్‌ సేవలనే కాకుండా శాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను అందించేందుకు జియో ప్రణాళికలను రచిస్తోంది.భారత్‌లో అతి తక్కువ సమయంలో నంబర్‌ వన్‌ మొబైల్‌ నెట్‌వర్క్‌ సేవలను అందిస్తోన్న టెలికాం కంపెనీగా రిలయన్స్‌ జియో అవతరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు శాటిలైట్‌ ద్వారా బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను అందిచేందుకుగాను రిలయన్స్‌ జియో సంస్థ జాయింట్‌ వెంచర్‌ను నెలకొల్పింది.

శాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవల్లో భాగంగా జియో ప్లాట్‌ఫామ్స్‌ లిమిటెడ్‌, లక్సెంబర్గ్‌కు చెందిన శాటిలైట్‌, టెలికమ్యూనికేషన్స్‌ నెట్‌వర్క్‌ ప్రొవైడర్‌ ఎస్‌ఈఎస్‌ సంయుక్తంగా జియో స్పేస్ టెక్నాలజీ లిమిటెడ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాయి. ఈ జాయింట్‌ వెంచర్‌లో జియో ప్లాట్‌ఫామ్స్‌ 51 శాతం, ఎస్‌ఈఎస్‌ 49 శాతం వాటాలను కల్గి ఉన్నాయి. జియో స్టేషనరీ, మీడియం ఎర్త్‌ ఆర్బిట్లలో పలు శాటిలైట్లను ప్రయోగించనున్నాయి. ఈ శాటిలైట్లతో బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను రిలయన్స్‌ జియో అందించనుంది.

ఎలాగైనా శాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను భారత్‌లో నెలకొల్పాలనే ఎలన్‌మస్క్‌ ప్రణాళికలకు రిలయన్స్‌ జియో గట్టి పోటీని ఇచ్చే అవకాశం ఉంది. స్టార్‌లింక్‌ సేవలను భారత్‌లో ప్రవేశపెట్టాలనే మస్క్‌ ప్రయత్నాలకు కేంద్ర ప్రభుత్వం అడ్డుపడింది. భారత్‌తో పాటుగా పొరుగుదేశాలకు కూడా శాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను రిలయన్స్‌ జియో అందించనుంది. ఇక శాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ విషయంలో మరో దేశీయ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌ ముందుంది. టాటా గ్రూపు సైతం ఈ పనులు ఎప్పుడో ప్రారంభించింది. ఇప్పటికే 66 శాతం పైగా శాటిలైట్లను వన్‌వెబ్‌ సహకారంతో విజయవంతంగా పూర్తి చేసింది.