మతంలోకి మారిన కులం మాత్రం మారదు

మతంలోకి మారిన కులం మాత్రం మారదు

ఒక మతం నుంచి ఇంకో మతంలోకి మారినా కులం మాత్రం మారదని మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రాధాన్యత కోసం కులాంతర వివాహ ధ్రువీకరణ పత్రం పొందేందుకు క్రైస్తవ మతాన్ని స్వీకరించిన దళితుడి పిటిషన్‌ను రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది. చట్టం ప్రకారం మతం మార్చుకున్న దళితులను ఎస్సీలుగా కాకుండా వెనుకబడి వర్గం గా పరిగణిస్తారు. తమిళనాడులో ఎస్సీ/ ఎస్టీలు లేదా బీసీలను అగ్ర కులానికి చెందినవారి పెళ్లాడితే వాటిని కులాంతర వివాహాలుగా పరిగణిస్తారు.

వీరికి ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రాధాన్యత ఉంటుంది. ఈనేపథ్యంలో కేవలం మతమార్పిడితోనే బీసీగా పరిగణించరని, దళితుడు మరొక దళితుడ్ని పెళ్లి చేసుకుంటే అది కులాంతర వివాహం కాదని జస్టిస్ ఎస్ఎం సుబ్రమణ్యం పునరుద్ఘాటించారు.

‘‘పిటిషనర్ స్వతహాగా ఆది-ద్రావిడ సామాజిక వర్గానికి చెందినవాడు.. క్రైస్తవ మతంలోకి మారడంతో అతడికి వెనుకబడిన తరగతి సర్టిఫికేట్ జారీ అయ్యింది.. అయితే, పుట్టుకతోనే అతడు ‘ఆది-ద్రావిడ’ కమ్యూనిటీకి చెందినవాడు.. మతం మారినా కులం మాత్రం మారదు.. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, అత్యంత వెనుకబడిన తరగతులు, వెనుకబడిన తరగతులు, ఇతర కులాల వర్గీకరణ కులాన్ని మార్చదు’’ అని న్యాయమూర్తి స్పష్టం చేశారు.

బీసీ సర్టిఫికెట్ పొందిన క్రైస్తవ మతం స్వీకరించిన ఆది-ద్రావిడ దళితుడు ఎస్ పాల్ రాజ్‌.. హిందూ అరుంథతియార్ దళిత సామాజిక వర్గానికి చెందిన అముతాను వివాహం చేసుకున్నారు. కులాంతర వివాహం చేసుకున్న నేను బీసీనని, దళితుడ్ని కాదని రాజ్ వాదించారు. బీసీ వర్గానికి చెందిన వ్యక్తి ఎస్సీలను వివాహం చేసుకుంటే ప్రభుత్వ ఉద్యోగాలు, పథకాల్లోనూ ప్రాధాన్యత ఇస్తారని వాదించాడు. ఇందుకు 1976 డిసెంబరు 2న తమిళనాడు ప్రభుత్వం వెలువరించిన ఉత్వర్వులను ఉదహరించాడు.

‘జీవితభాగస్వాముల్లో ఒకరు ఎస్సీ లేదా ఎస్టీ సమాజానికి వర్గానికి చెందినవారైతే కులాంతర వివాహ ధ్రువీకరణ పత్రాన్ని జారీచేయాలని ఈ ఉత్తర్వులు చెబుతున్నాయి’ అని ఆయన వాదించాడు. అయితే, దీనిని తిరస్కరించిన సేలం జిల్లా అధికారులు..స్వయంగా దళిత వర్గానికి చెందినవాడని, అతడు మతం మారడం వల్ల తన కులం మారదని పేర్కొన్నారు. దీంతో పాల్ రాజ్ హైకోర్టును ఆశ్రయించాడు. అక్కడ కూడా అతడికి చుక్కెదురయ్యింది.

‘‘మతం మారిన వ్యక్తి కులాంతర వివాహ ధ్రువీకరణ పత్రాన్ని జారీచేస్తే ఈ కోటా కింద మంజూరు చేసిన ప్రయోజనాన్ని దుర్వినియోగం చేయడానికి పౌరులకు మార్గం సుగమం అవుతుంది.. దీని పర్యవసానం పెద్దదిగా ఉంటుంది.. అందువల్ల, జీవిత భాగస్వాముల్లో ఎవరైనా షెడ్యూల్డ్ కులానికి చెందిన వారై, మరొకరు ఇతర కులానికి చెందినవారైతే మాత్రమే కులాంతర వివాహ ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేయాలి’’ అని జస్టిస్ సుబ్రమణియమ్ తన తీర్పులో పేర్కొన్నారు.