రెండు లగ్జరీ కార్లను అమ్మేసిన రేణు దేశాయ్

రెండు లగ్జరీ కార్లను అమ్మేసిన రేణు దేశాయ్

సినీ నటి రేణు దేశాయ్‌ నటనకు గుడ్‌బై చెప్పి చాలా కాలం అయ్యింది. అయినా ఆమె సినిమాలను డైరెక్ట్ చేస్తూనో, ప్రొడక్షన్‌ చేస్తూ అదేవిధంగా సామాజిక కార్యకలాపాలను చేపడుతూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. తాజాగా ఆమె చేసిన ఒక పని అందరికి ఆదర్శంగా నిలుస్తోంది. రేణు దేశాయ్‌ తన రెండు లగ్జరీ కార్లు ఆడీ ఏ6, పోర్షే బాక్సర్‌లను అమ్మేశారు. దీనికి గల కారణాన్ని రేణు సోషల్‌ మీడియా వేదికగా తెలియజేశారు. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడంలో భాగంగా డిజీల్‌, పెట్రల్‌తో నడిచే వాహనాల వినియోగాన్ని తగ్గించాలనే ఉద్దేశ్యంతో తన రెండు లగ్జరీ కార్లను అమ్మేసినట్టు పేర్కొన్నారు.

రేణుదేశాయ్‌ దీనికి సంబంధించి ఒక మంచి సందేశాన్ని ఇచ్చారు. పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలని రేణు విజ్ఞప్తి చేశారు. అందరూ ఎలక్ట్రిక్ కార్లు, బైకులను కొనాలని పిలుపునిచ్చారు. తన కార్లను అమ్మేసి ఆ స్థానంలో ఈ-ఎలక్ట్రిక్ హ్యుండాయ్ కారును కొన్నానని రేణు వెల్లడించారు. మారిష్‌లో జరిగిన చమురు లీకేజీ గురించి చదివిన తర్వాత ఈ నిర్ణయాన్ని తీసుకున్నానని పేర్కొన్నారు. ఇంధనాలతో నడిచే వాహనాలను వినియోగించడం వల్ల భూమి మీద ఉండే జీవులకు క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.