రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం

రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం

రంగారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో టిప్పర్‌ చక్రాల కిందపడి ఓ యువకుడు దుర్మరణం పాలైయ్యాడు. ఈ సంఘటన కందుకూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని రాచులూరుకు చెందిన తిరుగమళ్ల శ్రీనాథ్‌(23) బేగకరికంచె సమీపంలోని అమెజాన్‌ కంపెనీ వద్ద సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం గ్రామం నుంచి విధులకు హాజరుకావడానికి మధ్యాహ్నం సమయంలో బైక్‌పై బయలుదేరాడు.

మార్గమధ్యలో రాచులూరు–కటికపల్లి మార్గంలో కటికపల్లి నుంచి మట్టిలోడ్‌తో వస్తున్న టిప్పర్, బైక్‌ను ఢీకొనడంతో టిప్పర్‌ చక్రాల కిందపడి దుర్మరణం చెందాడు. మృతుడికి తండ్రి, చెల్లెలు ఉన్నారు. నెలరోజుల క్రితమే మృతుడి తల్లి ఆండాలు చనిపోవడం, ఇప్పుడు కుమారుడిని కోల్పోవడంతో ఆ కుటుంబం తల్లడిల్లుతుంది. గ్రామస్తులు,బంధువులు ఘటనా స్థలానికి చేరుకుని న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టారు. అందరితో కలుపుగోలుగా ఉండే శ్రీనాథ్‌ చనిపోవడం జీర్ణించుకోలేకపోతున్నామని తెలిపారు. సీఐ కృష్ణంరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.