కష్టపడుతున్న రోహిత్‌ శర్మ

కష్టపడుతున్న రోహిత్‌ శర్మ

వన్డే కెప్టెన్‌గా ఎంపికైన తర్వాత తొలి సిరీస్‌కే దూరమయ్యాడు రోహిత్‌ శర్మ. గాయం కారణంగా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లలేకపోయాడు. ఈ క్రమంలో బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో రిహాబిలిటేషన్‌ సెంటర్‌లో హిట్‌మ్యాన్‌ చికిత్స పొందుతున్నాడు. ఫిట్‌నెస్‌ నిపుణుల పర్యవేక్షణలో ట్రెయినింగ్‌ తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో బరువు తగ్గాల్సిందిగా శిక్షకులు అతడికి సూచించినట్లు సమాచారం.

తద్వారా మోకాలిపై భారం తగ్గి త్వరగా కోలుకునేందుకు ఆస్కారం ఉంటుందని చెప్పినట్లు తెలుస్తోంది. సుమారు 5-6 కిలోలు బరువు తగ్గాల్సిందిగా సూచించిన నేపథ్యంలో… రోహిత్‌ ఆ దిశగా వర్కౌట్లు చేస్తున్నట్లు సమాచారం. కాగా టీమిండియా ఆటగాళ్లు రవీంద్ర జడేజా, శిఖర్‌ ధావన్‌, భువనేశ్వర్‌ కుమార్‌, సంజూ శాంసన్‌ తదితరులు కూడా రిహాబిలిటేషన్‌ సెంటర్‌లో రోహిత్‌తో పాటు ట్రెయినింగ్‌ తీసుకుంటున్నారు.

ఈ క్రమంలో గబ్బర్‌.. తమ కెప్టెన్‌ రోహిత్‌, భువీతో ఉన్న ఫొటోను సోమవారం సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. ఇది చూసిన ఫ్యాన్స్‌.. హిట్‌మ్యాన్‌ కాస్త సన్నబడినట్లు కనిపిస్తున్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక గాయం కారణంగా దక్షిణాఫ్రికా టూర్‌కు దూరం కాగా…. ధావన్‌, భువీ శిక్షణ పూర్తైన తర్వాత వన్డే సిరీస్‌ నిమిత్తం సౌతాఫ్రికాకు వెళ్లనున్నారు. ఇదిలా ఉండగా సెంచూరియన్‌లో మొదటి టెస్టు గెలిచిన కోహ్లి సేన… వాండరర్స్‌లోనూ విజయం సాధించి సఫారీ గడ్డపై చరిత్ర సృష్టించాలని ఉవ్విళ్లూరుతోంది. ఇక జనవరి 19 నుంచి వన్డే సిరీస్‌ ఆరంభం కానుంది.