నా కలలన్నీ చెదిరిపోయాయి

నా కలలన్నీ చెదిరిపోయాయి

అక్కినేని నాగ చైతన్యతో విడాకుల అనంతరం ఒక్కసారిగా మోస్ట్‌ పాపులర్‌ అయింది స్టార్‌ హీరోయిన్‌ సమంత. ఈ టాలీవుడ్‌ క్యూట్‌ కపుల్‌ విడిపోవడంపై అభిమానులు, సినీ ప్రేక్షకులు, ప్రముఖులు సైతం షాకయ్యారు. ఎందుకిలా జరిగిందా అని ఆరా తీశారు. తనపై జరిగిన ట్రోలింగ్‌, వచ‍్చిన నెగెటివ్‌ కామెంట్స్‌ తర్వాత తన జీవితంలో ఎదురైన సమస్యల నుంచి బయటపడేందుకు తనకు సమయం ఇవ్వాలని కోరింది సామ్‌. ఇదిలా ఉంటే ఇటీవల తన విడాకులపై తొలిసారిగా స్పందించిన సమంత మరోసారి వ్యక్తిగత విషయాలను వెల్లడించింది. తన వ్యక్తిగత జీవితంలో తగిలిన ఎదురుదెబ్బలతో 2021 సంవత్సరం ఎంతో కష్టంగా గడిచిందని తెలిపింది. దీంతో తన భవిష్యత్తుపై తనకు ఆశలు లేవని చెప్పుకొచ్చింది.

ఇటీవల ఓ ఛానెల్‌కు బాలీవుడ్‌ నటీనటులతో కలిసి చిట్‌చాట్‌లో పాల్గొన్న సామ్‌.. విడాకుల తర్వాత తనపై జరిగిన ట్రోలింగ్‌ గురించి స్పందించింది.’ఎన్నో సంవత్సరాలు కష్టపడి నా కెరీర్‌ నిర్మించుకున్నాను. కానీ 2021లో నా వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకున్న పరిణామాల కారణంగా నా కలలన్నీ చెదిరిపోయాయి. నేనెంతో కృంగిపోయాను. ఇక సోషల్‌ మీడియా అనేది నటీనటులను తమ అభిమానులకు దగ్గరగా చేస్తుంది. దీంతో కొంతమంది నెటిజన్స్‌ నుంచి ప్రేమాభిమానాలు పొందుతున్నాను. ప్రస్తుతం వారు నా జీవితంలో భాగమయ్యారు. కానీ మరికొంత మంది మాత్రం ట్రోల్‌ చేస్తున్నారు.

అసభ్యకరమైన కామెంట్స్‌ చేస్తున్నారు. వారందరినీ నేను కోరేది ఒక్కటే. నేను చేసే ప్రతిదాన్ని అంగీకరించాలని డిమాండ్ చేయను. కానీ మీకు నా అభిప్రాయాలు నచ్చకపోతే దాన్ని చెప్పడానికి ఒక విధానం ఉంటుంది. ఈ ఏడాది నా కలలన్ని శిథిలమైయాయి. అందుకే వచ్చే సంవత్సరంపై ఆశలు పెట్టుకోలేదు. కాలం నా కోసం ఏది రాసిపెడితే దాన్ని ధైర్యంగా స్వీకరిస్తాను.’ అని తన ఆవేదన తెలిపింది సమంత.ఇటీవల ‘నేను విడాకులు తీసుకున్నప్పుడు కుంగిపోయి చనిపోతానని అనుకున్నాను. నేను చాలా బలహీనమైన వ్యక్తినని నా ఫీలింగ్‌. కానీ నేను ఎంత బలంగా ఉన్నానో తెలిసి ఇప్పుడు ఆశ్చర్యం వేస్తోంది. నేను ఇంత దృఢంగా ఉండగలనని అనుకోలేదు.’ అంటూ తన విడాకులపై తొలిసారిగా స్పందించింది సామ్‌.