వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి కేసు దర్యాప్తు వేగంగా సాగుతోంది. ఈ కేసు దర్యాప్తుకోసం సిట్ ఏర్పాటు చేశారు. నిందితుడి దగ్గర నుంచి 11 పేజీల లేఖ స్వాధీనం చేసుకున్న పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. పోలీసుల దర్యాప్తులో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జగన్ స్టేట్ మెంట్ ను రికార్డు చేయడానికి ఏపీ సిట్ అధికారులు హైదరాబాద్ చేరుకున్నారు. అడిషనల్ డీసీపీ మహేంద్ర పాత్రుడి నేతృత్వంలో డీఎస్పీ నాగేశ్వరరావు , మరో ఇద్దరు ఇన్స్పెక్టర్ల బృందం వైఎస్ జగన్పై జరిగిన హత్యాయత్నానికి సంబంధించిన వాంగ్మూలాన్ని రికార్డు చేసుకోనున్నారు. విశాఖలో దాడి అనంతరం హైదరాబాద్ చేరుకున్న జగన్.. ప్రస్తుతం సిటీ న్యూరోలో చికిత్స తీసుకుంటున్నారు. వైఎస్ జగన్ హెల్త్ రిపోర్ట్ వచ్చిన తరువాత ఆయన స్టేట్మేంట్ ను సిట్ అధికారులు రికార్డు చేస్తారు.
జగన్ పై కత్తి దాడి కేసు విచారణ కోసం డీజీపీ సిట్ ఏర్పాటు చేశారు. సిట్కు నేతృత్వం వహిస్తున్న నాగేశ్వరరావుతో పాటు సీఐలు ఈ కేసు పూర్వాపరాలను లోతుగా అధ్యయనం చేస్తున్నామన్నారు. నిందితుడిని తూర్పుగోదావరి జిల్లా ఠానేలంక గ్రామానికి చెందిన జానిపల్లి శ్రీనివాసరావుగా గుర్తించారు. జగన్పై దాడి జరిగిన తరువాత విశాఖ ఎయిర్పోర్టులో శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని స్టేట్మెంట్ను వీడియో రికార్డ్ చేశారు. నిందితుడి దగ్గర 11 పేజీల లేఖను స్వాధీనం చేసుకుని..అతన్ని ప్రాధమికంగా ఏడు గంటల పాటు విచారించారు. వైసీపీ అంటే తనతో సహా తమ కుటుంబం మొత్తానికి అభిమానమని శ్రీనివాసరావు చెప్పాడు.
11 పేజీల లేఖలో జగన్ సీఎం అయితే ఏం చేయాలి అనే విషయాలు రాశాడని విశాఖ అడిషనల్ డీసీపీ మహేంద్ర పాత్రుడు తెలిపారు. జగన్ గతంలోనే ఏపీ సీఎం కావలసి ఉండగా అలా జరగలేదని, ఈ సారైనా జగన్ సీఎం కావాలని తన కోరిక అని విచారణలో తెలిపిన శ్రీనివాసరావు సానుభూతి వస్తుందనే ఉద్దేశంతోనే దాడి చేశానన్నాడు. అటు నిందితుడు విశాఖలో ఉంటున్న గదితో పాటు ఠానేలంకలోని నిందితుడి ఇంటిలో పోలీసులు సోదాలు చేశారు. వైఎస్ జగన్పై దాడి చేసిన శ్రీనివాసరావు ఏడాదిలో 9 సెల్ ఫోన్లు మార్చారని ఏడీసీపీ మహేంద్ర పాత్రుడు తెలిపారు. ఇప్పుడు వాడుతున్న ఫోను కూడా 2 రోజుల క్రితమే మార్చాడనీ చెప్పారు.
నిందితుడు ఏడాదిలో 10 వేల కాల్స్ మాట్లాడినట్లు వివరించారు. నిందితుడి సోదరుడి దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లో జగన్ ఫ్లెక్సీ ఉందని, ఆ ఫొటోను కొందరు మార్ఫింగ్ చేసి సీఎం, లోకేశ్ ఫొటోలు పెడుతున్నారన్నారని . మహేంద్ర పాత్రుడు చెప్పారు. ఇలా మార్ఫింగ్ చేసి ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టడం చట్టవిరుద్ధమని, గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు జగన్పై దాడి జరిగిన విశాఖ ఎయిర్పోర్టులోని వీఐపీ లాంజ్లో సీసీ కెమెరా లేనట్లు సమాచారం. నిందితుడు కత్తి ఎలా తీసుకెళ్లాడనేది వీడియో పుటేజులు పరిశీలించాల్సి ఉందని అడిషనల్ డీసీపీ మహేంద్ర పాత్రుడు చెప్పారు.
అయితే జగన్ కు రాసినట్టుగా నిందితుడి వద్ద దొరికిన లేఖ మీద పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే నిందితుడు శ్రీనివాసరావు రాసిన లేఖ ఏ మాత్రం నలగలేదు. 11 పేజీల ఉత్తరాన్ని జేబులో పెట్టకుని ఉంటే.. కనీసం నాలుగు మడతలైనా ఉండాలి. కానీ అదేం లేదు. కొత్త పేపర్లలా తళతళలాడిపోతున్నాయి. అంతేకాక లేఖల్లోని రాత చాలా నీటుగా ఉంది. 11 పేజీలు ఉందని అంటున్నారు. కానీ పేజీ, పేజీకి రైటింగ్ మారిపోయింది. నిందితుడి సంతకానికి లేఖలోని రైటింగ్కు ఏ మాత్రం సంబంధం లేదు అనేది లేఖలో మనం గమనించ వచ్చు. 4.లేఖలో చాలా భావుకత ఉంది. విషయ పరిజ్ఞానం కొట్టొచ్చినట్టు కనబడింది. సమకాలీన అంశాలపై సంపూర్ణ అవగాహన ఉన్నట్లుగా రాశాడు. ఇదెలా సాధ్యం. అక్షర దోషాలు పెద్దగా లేవు. వ్యాక్య నిర్మాణాల్లో లోపాలూ తక్కువగానే ఉన్నాయి.
పదో తరగతి మాత్రమే చదివిన వాడు అంత మంచి భాషతో, విషయ పరిజ్ఞానంతో రాయడమా..? అనే అనుమానం కూడా వ్యక్తమవుతోంది. అతడికి ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేసింది. ఆడబ్బుతోపాటు మరో రూ.8లక్షలతో సొంత ఇళ్లు కట్టుకున్నాడని అంటున్నారు. కానీ లేఖలో ఇళ్లు కట్టుకోడానికి కూడా ఇబ్బందులు పడాల్సి వస్తోందని రాసినట్లుగా ఉంది. ప్రభుత్వం ఇస్తున్న డబ్బు సరిపోవడం లేదని ఉంది. అంతేకాక నిందితుడు పట్టుబడిన వెంటనే లేఖను ఎందుకు విడుదల చేయలేదు? నిందితుడు రాసినట్లుగా చెప్పబడుతున్న లేఖను ఏడు గంటలు గడిచాక గాని ఎందుకు బయటపెట్టారు? అనే అనుమానాలు ఇప్పడు వైసేపీ నేతలు, కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాక ఆ లేఖలో శ్రీనివాసరావు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. ఘటన తరువాత తనకేదైనా ప్రాణహాని జరిగితే, తన అవయవాలను దానం చేయాలని తన తల్లిదండ్రులకు విన్నవించుకున్నాడు. వైఎస్ రాజశేఖరరెడ్డి అంటే తనకెంతో అభిమానమని, చంద్రబాబు పాలనలో ప్రజలు ఎన్నో కష్టాలు పడుతున్నారని చెప్పుకొచ్చాడు. జగన్ అధికారంలోకి వస్తే, అమలు చేయబోయే సంక్షేమ పథకాలను వివరించాడు. ఒకసారి లబ్ధి పొందిన వారే, మళ్లీ మళ్లీ లబ్ది పొందుతున్నారని ఆరోపించాడు. పేదలకు ఏ విధమైన పథకాలూ అందడం లేదని ఆరోపించాడు. చివరిలో శ్రీనివాసరావు తన సంతకాన్ని కూడా చేయగా, సీఐఎస్ ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్, చీఫ్ సెక్యురిటీ ఆఫీసర్ సంతకాలతో లేఖను అధికారులు ధ్రువీకరించారు. అయితే ఈ లేఖ అతనే రాశాడా లేదా ఎవరినా రాసి ఇస్తే సంతకం చేశాడా అనే విషయాలు తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసులు.