అగ్నిపర్వతం నుంచి బూడిద

అగ్నిపర్వతం నుంచి బూడిద

ఈ ఫొటోలు చూస్తే ఏమనిపిస్తోంది? ఎడమవైపున ఉన్న ఫొటోలో ఏదో నదో, వాగో ఎండిపోయినట్టు.. కుడిపక్కనున్న ఫొటోలో వరద వచ్చో, కొండచరియలు విరిగిపడో ట్రక్కులు కూరుకుపోయినట్టు అనిపిస్తోంది కదా. కానీ ఇవేవీ కాదు. ఇండోనేసియాలోని జావా ద్వీపంలో ఉన్న మౌంట్‌ సెమెరు అగ్ని పర్వతం బద్దలైన తర్వాత జరిగిన బీభత్సమిది.

భారీ పేలుడుకు అగ్నిపర్వతం నుంచి బూడిద కిలోమీటర్ల మేర ఆకాశాన్ని కప్పేసింది. లావా, సీరింగ్‌ వాయువు దాదాపు 11 కిలోమీటర్ల మేర వ్యాపించాయి. పర్వతానికి దగ్గర్లోని బెసుక్‌ కొబొకన్‌ నది మొత్తం బూడిద, బురదతో నిండిపోయి ఇలా కనిపించింది. చుట్టుపక్కల గ్రామాలన్నీ బూడిదమయమయ్యాయి.

ఈ ప్రకృతి విపత్తు ఎంతో మందికి తీరని నష్టాన్ని మిగిల్చింది. ఇప్పటివరకు 48 మంది మృతి చెందినట్టు స్థానిక మీడియా సమాచారం. ప్రభావిత ప్రాంతాల నుంచి దాదాపు 10 వేల మందిని ఖాళీచేయించారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. సముద్ర మట్టానికి 3,676 మీటర్ల  ఎత్తులో ఉన్న సెమెరు పర్వతం, గతేడాది డిసెంబర్.. ఈ సంవత్సరం జనవరిలో విస్ఫోటనం చెందింది.