అనుష్క శర్మ కి క్షమాపణలు చెప్పిన మాజీ క్రికెటర్

అనుష్క శర్మ కి క్షమాపణలు చెప్పిన మాజీ క్రికెటర్

వన్డే ప్రపంచకప్‌ సమయంలో భారత సెలక్టర్లలో ఒకరు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మకి టీ సర్వ్ చేశాడని ఆరోపణలు గుప్పించిన మాజీ క్రికెటర్ ఫరూక్ ఇంజినీర్ క్షమాపణలు చెప్పాడు. వరల్డ్‌కప్ టైమ్‌లో తాను ఒక్క మ్యాచ్‌‌కి మాత్రమే హాజరయ్యాను అది కూడా ఫ్యామిలీలు కూర్చునే గ్యాలరీలోనే కూర్చున్నట్లు చెప్పుకొచ్చిన  అనుష్క శర్మ అనవసరంగా తనని వివాదాల్లోకి లాగొద్దంటూ ఫరూక్‌కి చురకలేసింది. టీ వివాదంపై భారత క్రికెట్‌లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరగడం, అనుష్క ఘాటుగా రిప్లై ఇవ్వడంతో ఫరూక్ వెంటనే క్షమాపణలు కోరాడు.

అసలు ఫరూక్ ఏమన్నాడంటే ‘వరల్డ్‌కప్ టైమ్‌లో టీమిండియా బ్లేజర్ వేసుకుని ఒక వ్యక్తి అనుష్క శర్మకి టీ అందించాడు. ఎవరు నువ్వు అని అతడ్ని నేను ప్రశ్నించగా తాను టీమిండియా సెలక్టర్‌ని అతని అతను సమాధానం ఇచ్చాడు’ అని 82 ఏళ్ల భారత మాజీ వికెట్ కీపర్ ఫరూక్ వెల్లడించాడు. దీంతో అనుష్క శర్మపై పెద్ద ఎత్తున అభిమానులు విమర్శలు గుప్పించారు.

ఫరూక్ ఆరోపణలపై అనుష్క శర్మ భావోద్వేగంగా స్పందించింది. ‘ప్రపంచకప్‌లో నేను ఒక మ్యాచ్‌కి మాత్రమే హాజరయ్యాను. అదీ స్టేడియంలో క్రికెటర్ల ఫ్యామిలీలు కూర్చునే గ్యాలరీలో కూర్చున్నాను తప్ప సెలక్టర్ల బాక్స్‌లో కాదు. కానీ  నాకు సెలక్టర్ టీ ఇచ్చారనడంలో వాస్తవం లేదు. నన్ను అనవసరంగా వివాదాల్లోకి లాగొద్దు. మీరు (ఫరూక్) సెలక్టర్లని విమర్శించాలి అనుకుంటే అది మీ ఇష్టం. కానీ ఆ విమర్శలకి సంచలనాలు జోడించడానికి నన్ను మధ్యలోకి లాగకండి’ అని రిప్లై ఇచ్చింది.