సుశాంత్‌కు న్యాయం జరిగేవరకు పోరాడదాం

సుశాంత్‌కు న్యాయం జరిగేవరకు పోరాడదాం

బాలీవుడ్‌ యంగ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కుటుంబాన్ని కలిసేందుకు పట్నా వెళుతున్నట్లు టెలివిజన్‌ హోస్ట్‌, నటుడు శేఖర్‌ సుమన్‌ సోషల్‌ మీడియాలో ప్రకటించారు. సోమవారం ఆయన ట్వీట్‌ చేస్తూ.. ‘సుశాంత్‌ తండ్రిని కలిసేందుకు నా స్వస్థలమైన పట్నాకు వెళ్తున్నాను’ అంటూ ట్వీట్‌ చేశారు. అంతేగాక సుశాంత్‌ ఆత్మహత్య కేసులో సీబీఐ దర్యాప్తును మరింత వేగవంతం చేయాలని బిహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌కు విజ్ఞప్తి చేశారు. ఇంతకుముందు కూడా సుశాంత్‌ మృతిపై స్పందిస్తూ ఇలా జరుగుతుందని ముందుగానే ఊహించాను అంటూ ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే.

‘‘సుశాంత్‌ ఆత్మహత్యను నేను ముందుగానే ఊహించాను. అతడు ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అలా అని సుశాంత్‌ది సాధారణ మరణమని ఎవరూ భావించకండి. దీని వెనక చాలా పెద్ద కారణం ఉంది. దీనిపై సీబీఐ దర్యాప్తును వేగవంతం చేయాలి. సుశాంత్‌కు న్యాయం జరిగేవరకు పోరాడదాం’ అంటూ ఆయన ట్విటర్‌ వేదికగా పిలుపునిచ్చారు. కాగా జూన్‌ 14 సుశాంత్‌ ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అతడి మరణానికి బాలీవుడ్‌ పేరుకుపోయిన నెపోటిజం కారణమంటూ స్టార్‌కిడ్స్‌, ప్రముఖ దర్శకనిర్మాతలపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. అంతేగాక స్టార్‌కిడ్స్‌ సినిమాలను బైకాట్‌ చేయాలంటూ సోషల్‌ మీడియాలో నెటిజన్లు పిలుపునిస్తున్నారు.