నెట్టింట శిఖర్‌ ధవన్‌ హల్‌చల్‌

నెట్టింట శిఖర్‌ ధవన్‌ హల్‌చల్‌

యువ ఆటగాళ్లు రాణిస్తుండడంతో గతకొంత కాలంగా బెంచ్‌కే పరిమితమైన టీమిండియా సీనియర్‌ ప్లేయర్‌ శిఖర్‌ ధవన్‌ సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నాడు. రకరకాల ఫన్నీ మీమ్స్‌తో పాటు డ్యాన్స్‌లు, హిట్‌ సినిమాల్లోని పాపులర్‌ డైలాగ్‌లతో నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాడు. తాజాగా స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ పాన్‌ ఇండియా మూవీ ‘పుష్ప’లోని సూపర్‌ హిట్‌ డైలాగ్‌ను హిందీలో చెప్పి బన్నీ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాడు. తగ్గేదేలే అంటూ బల్ల బద్ధలు కొట్టాడు. పుష్ప… పుష్పరాజ్‌… మై ఝుకేగా నై అంటూ అదిరిపోయే రేంజ్‌లో హావభావాలు పలికించాడు.

తమ అభిమాన హీరో పవర్‌ఫుల్‌ డైలాగ్‌ని గబ్బర్‌ అదిపోయే రేంజ్‌లో చెప్పడంతో బన్నీ ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. గబ్బర్‌ను ప్రశంసలతో ముంచెత్తుతూ, త్వరలో జరగనున్న దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌ కోసం ఆల్‌ ద బెస్ట్‌ చెబుతున్నారు. ఇదిలా ఉంటే, జనవరి 19 నుంచి ప్రారంభంకానున్న దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో ధవన్‌ చోటు దక్కించుకున్నాడు. ధవన్‌ చివరిసారిగా గతేడాది శ్రీలంకలో పర్యటించిన భారత జట్టుకు నాయకత్వం వహించాడు.