దూకుడు మీద ఉన్న ప్రియాంక గాంధీ

దూకుడు మీద ఉన్న ప్రియాంక గాంధీ

ఉత్తర ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి , ఇన్‌ఛార్జ్ ప్రియాంక గాంధీ వాద్రా దూకుడు మీద ఉన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ కంచుకోటను ఎలాగైనా తిరిగి సొంతం చేసుకోవాలనే వ్యూహంలో శరవేగంగా కదులుతున్నారు. ఇందులో భాగంగానే తాజాగా విద్యార్థినులకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించారు.

యూపీలో 2022 అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే 12వ తరగతి అమ్మాయిలకు స్మార్ట్‌ఫోన్‌లు, గ్రాడ్యుయేట్‌లకుఎలక్ట్రానిక్ స్కూటీలను అందిస్తామని ప్రియాంక గురువారం ప్రకటించారు. వారి చదువుకు, భద్రతకు స్మార్ట్‌ఫోన్లు అవసరమని పేర్కొన్నారు. ఇందుకు మ్యానిఫెస్టో కమిటీ అంగీకరించడం సంతోషంగా ఉందన్నారు.

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 40 శాతం టికెట్లను రిజర్వ్‌ చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.మహిళల ఓట్లను ఆకర్షించేలామహిళలకు 40 శాతం టిక్కెట్లను కేటాయించనున్నట్టు ప్రియాకం ప్రకటించారు. వ్యవస్థలో మార్పు తీసుకురావాలనుకునే మహిళలు ముందుకు వచ్చి ఎన్నికల్లో పోటీ చేయాలన్నారు. పోటీ చేయాలనుకునే ఏ స్త్రీ అయినా నవంబర్ 15 వరకు దరఖాస్తు చేసుకోవాలని విలేకరుల సమావేశంలో ప్రకటించారు.దీనికి రాహుల్‌గాంధీ కూడా మద్దతుగా నిలిచారు.

కాగా దేశంలో అతిపెద్ద, అత్యంత ముఖ్యమైన, సంక్లిష్టమైన ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో విజయం సాధించడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. యూపీలో 1989 నుండి అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్, రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో తిరిగి తన పట్టు సాధించాలని కోరుకుంటోంది.